24 నుంచి వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు
ABN , First Publish Date - 2020-12-13T09:22:20+05:30 IST
24 నుంచి వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు

తిరుమల, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈ నెల 24వ తేదీ నుంచి తిరుపతిలో సర్వదర్శన (ఉచిత) టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ ఈవో జవహర్రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాన్ని ఈ నెల 25 నుంచి జనవరి మూడో తేదీవరకు తెరిచి ఉంచుతామన్నారు. ఇప్పటికే రోజుకు 20వేల చొప్పున ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేశామని.. రోజుకు 10వేల చొప్పున పదిరోజులకు లక్ష సర్వదర్శన టోకెన్లను తిరుపతిలోని ఐదు ప్రదేశాల్లో కేటాయించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. గత నెలలో 8.47 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.61.29 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. ఈ-హుండీ ద్వారా రూ.3.75 కోట్లు లభించిందని, 50.04 లక్షల లడ్డూలను విక్రయించినట్టు చెప్పారు.