దుర్గాప్రసాద్ మృతికి వెంకయ్య, చంద్రబాబు, సుజనా సంతాపం
ABN , First Publish Date - 2020-09-17T03:17:05+05:30 IST
దుర్గాప్రసాద్ మృతికి వెంకయ్య, చంద్రబాబు, సుజనా సంతాపం

న్యూఢిల్లీ: ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీ సుజనా చౌదరి సంతాపం తెలిపారు. దుర్గాప్రసాద్ ఆత్మకుశాంతి కలగాలని కోరుకుంటున్నానని వెంకయ్యనాయుడు అన్నారు.
కాగా కరోనాతో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. 1994లో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఆయన.. 2019లో వైసీపీలో చేరి తిరుపతి నుంచి ఎంపీగా గెలుపొందారు.
1985లో రాజకీయాల్లోకి ప్రవేశించిన బల్లి దుర్గాప్రసాద్.. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. నెల్లూరు జిల్లా గూడూరు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996-98లో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా, 2009-14లో పీఏసీ మెంబర్గా సేవలు అందించారు. దుర్గాప్రసాద్ మృతిపట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణవార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎంపీ సుజనాచౌదరి అన్నారు. దుర్గాప్రసాద్ మంత్రిగా, ఎంపీగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పారు. దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి పట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు. దుర్గాప్రసాద్ మృతి ఎంతో బాధను కలిగించిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.