దేశ, రాష్ట్ర రాజకీయాలపై వెంకయ్య సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-02-08T23:26:06+05:30 IST
దేశ, రాష్ట్ర రాజకీయాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు...

విశాఖపట్నం : దేశ, రాష్ట్ర రాజకీయాలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చట్టసభల్లో రాజకీయపార్టీల నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నిన్న పార్లమెంట్లో చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరమన్నారు. పార్లమెంట్, శాసనసభల్లో నాయకులు వాడుతున్న భాష సిగ్గుచేటన్నారు. రాజకీయ నాయకులు ప్రత్యర్ధులమే కానీ శత్రువులు కాదని గుర్తుంచుకోవాలన్నారు.
సిగ్గనిపిస్తున్నాయ్!
‘అమ్మ, అక్క అనే పదాలు అత్యంత పవిత్రమైనవి. కానీ అసెంబ్లీల్లో నాయకులు అమ్మ, అక్కలను అవమానించేలా మాట్లాడుతున్నారు. అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లో ఇదే పద్ధతి కొనసాగుతోంది. జరుగుతున్న పరిస్థితులు సిగ్గనిపిస్తున్నాయి.. ఈ పరిస్థితి మారాలి. చట్టసభల్లో ప్రజాసమస్యలపై చర్చ జరగాలి. లక్షలు, కోట్లమంది చట్టసభల్లో జరుగుతున్న తీరును చూసి ఏం నేర్చుకోవాలి. 50 ఏళ్ల రాజకీయాల్లో క్రమశిక్షణతో ఉన్నాను కాబట్టే నేను ఈ స్థాయికి ఎదిగాను’ అని వెంకయ్య చెప్పుకొచ్చారు.