యూజీ, పీజీ పరీక్షలకు ఓకే
ABN , First Publish Date - 2020-07-14T08:09:35+05:30 IST
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో యూజీ, పీజీ, వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు
- ‘ఫైనల్ సెమిస్టర్’పై సర్కారు నిర్ణయం: మంత్రి సురేశ్ వెల్లడి
అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో యూజీ, పీజీ, వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సోమవారం మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబరులోగా ఆన్లైన్ లే దా ఆఫ్లైన్లో ఆయా పరీక్షలు నిర్వహించాలంటూ యూనివర్సిటీ గ్రాం ట్స్ కమిషన్(యూజీసీ) ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే, ఈ పరీక్షలు ఎప్పుడు, ఎలా నిర్వహించాలన్న విషయంపై వర్సిటీలకు స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలిపారు. దీంతో వర్సిటీలే షెడ్యూళ్లను రూపొందించుకోనున్నాయన్నారు.
ఇతర సంవత్సరాల విద్యార్థులను తదుపరి ఏడాదికి ప్రమోట్ చేస్తామని తెలిపారు. కాగా, కరోనా విస్తృతి నేపథ్యంలో ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆది నుంచి ఆందోళన నెలకొంది. పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. దీనిపై స్పందించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ చివరి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో ఏపీలో పరీక్షలు నిర్వహించనున్నారు.