శ్రావణి ఆత్మహత్య కేసులో ఆర్ఎక్స్100 నిర్మాత పేరు?
ABN , First Publish Date - 2020-09-10T16:38:15+05:30 IST
‘మనసు మమత’, ‘మౌనరాగం’ వంటి సీరియళ్లతో పాపులర్ అయిన బుల్లితెర నటి శ్రావణి (26)
హైదరాబాద్ : ‘మనసు మమత’, ‘మౌనరాగం’ వంటి సీరియళ్లతో పాపులర్ అయిన బుల్లితెర నటి శ్రావణి (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విదితమే. ఈ ఆత్మహత్య వ్యవహారంలో ప్రధానంగా దేవ్రాజ్రెడ్డి, సాయికృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే.. ‘ఆర్ఎక్స్-100’ సినిమా నిర్మాత అశోక్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. శ్రావణి ఆత్మహత్య చేసుకున్నప్పట్నుంచి గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. ఆమె ఆత్మహత్యకు కుటుంబ సభ్యులతో పాటు అశోక్ రెడ్డే అని దేవ్రాజ్ రెడ్డి చెబుతున్నాడు. అంతేకాదు.. తనను కాదని సాయితో పాటు అశోక్ రెడ్డితో కూడా ఆమె సన్నిహితంగా ఉండేదని కూడా ఆరోపణలు చేశాడు. అశోక్ రెడ్డి ఏటీఎం కార్డ్స్ కూడా శ్రావణి వాడేదని.. ఆయన కూడా ఆమెను పర్సనల్గా చూసుకునేవాడని తెలిసి తాను పట్టించుకోకుండా పక్కనపెట్టానని దేవ్రాజ్ చెబుతున్నాడు. అంతేకాదు.. సాయిపై కూడా దేవ్రాజ్ సంచలన ఆరోపణలే చేశాడు.
ఇంతవరకూ స్పందనలేదు..!
అయితే.. ఇప్పటికే తనపై వచ్చిన ఆరోపణలపై సాయికృష్ణ స్పందించి క్లారిటీ ఇచ్చుకున్నాడు. ఇంత జరుగుతున్నా అశోక్ రెడ్డి స్పందించకపోవడం గమనార్హం. దీంతో ఈ వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు.. ఈ ఆత్మహత్య కేసులో విచారణ ఇంకా కొనసాగుతున్నది. ప్రధాన నిందితుడు దేవ్రాజ్ పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాగా.. రాజమండ్రిలో బంధువులు, అభిమానుల మధ్య శ్రావణి అంత్యక్రియలు పూర్తయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు స్మశాన వాటికలో హిందూ సాంప్రదాయ ప్రకారం తన తండ్రి చేతుల మీదుగా శ్రావణి అంత్యక్రియలు జరిగాయి.
ఒక్కొక్కటిగా బయటకొస్తున్న దేవ్రాజ్ లీలలు
ఇలాంటి తరుణంలో దేవ్రాజ్ లీలలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. టిక్టాక్లో స్నేహం పేరుతో అమ్మాయిల వద్ద డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఈ విషయంలో గతంలోనే దేవ్రాజ్ భాగోతంపై ఎస్సార్నగర్ పీఎస్లో శ్రావణి ఫిర్యాదు చేసినట్లు తాజాగా వెలుగుచూసింది. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమించినట్లు ఫిర్యాదు ద్వారా వెల్లడయ్యింది. శ్రావణిని ప్రేమించి ముఖం చాటేయడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
సాయికృష్ణ ఏమంటున్నాడు..!?
అయితే.. దేవ్రాజ్ ఆరోపణలపై స్పందించిన సాయికృష్ణ ఈ ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. అంతేకాదు.. దేవ్రాజ్ చేస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండించాడు. తాను శ్రావణి కుటుంబానికి ఫ్యామిలీ మెంబర్ లాంటివాడినని చెప్పుకొచ్చాడు. దేవ రాజు విడుదల చేసిన వీడియో అవాస్తవమని.. శ్రావణి చనిపోయినప్పటి నుంచి తాను మృతదేహంతోనే ఉన్నానని తెలిపాడు. తానెక్కడికీ పారిపోలేదని పోలీసులతోనే ఉన్నానని సాయికృష్ణ చెబుతున్నాడు.
పెళ్లి చేయాలని భావించాం..
‘దేవ్రాజ్, అతడి తల్లి సీరియల్స్లో అవకాశాలు కల్పించాలని కోరడంతో ఆమె పలు అవకాశాలు ఇప్పించింది. కాకినాడకు చెందిన దేవ్రాజ్రెడ్డి టిక్టాక్ ద్వారా పరిచయమయ్యాడు. మా సమీప బందువుల్లో ఒక యువకుడితో పెళ్లి చేయాలని నిశ్చయించాం. అతనంటే శ్రావణికి ఇష్టమే. కొంత కాలం తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇంతలోనే ఇలా జరిగింది’ అని శ్రావణి పెద్దక్క అమల చెబుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది.