డబ్బుంటేనే వెంకన్న దర్శనం!

ABN , First Publish Date - 2020-10-07T15:44:56+05:30 IST

‘‘కలవారినేగాని కరుణించలేడా... నిరుపేద మొరలేవి వినిపించుకోడా...’’ అంటూ ఓ సినీ కవి పడిన ఆవేదన ప్రస్తుతం తిరుమలలో నిజమవుతోంది...

డబ్బుంటేనే వెంకన్న దర్శనం!

కొవిడ్‌ పేరిట సర్వదర్శనం నిలిపివేత 


తిరుమల: ‘‘కలవారినేగాని కరుణించలేడా... నిరుపేద మొరలేవి వినిపించుకోడా...’’ అంటూ ఓ సినీ కవి పడిన ఆవేదన ప్రస్తుతం తిరుమలలో నిజమవుతోంది. కేవలం డబ్బున్నవారికే వెంకన్న దర్శనం లభిస్తోంది. కొవిడ్‌ నిబంధనల పేరిట సర్వదర్శనం నిలిపివేయడంతో పేదలు కొండెక్కలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం స్వామిని దర్శించుకుంటున్న వారంతా టికెట్లు కొన్నవారే. ఇలాంటి పరిస్థితి ముందెప్పుడూ లేదంటూ టీటీడీపై విమర్శలు తీవ్రమవుతున్నాయి.


అధిక సంఖ్యలో భక్తులు అలిపిరికి చేరుకుని గుమికూడుతున్నారంటూ కొవిడ్‌ నిబంధనల పేరుతో సెప్టెంబరు 6 నుంచిఉచిత టికెట్ల జారీని టీటీడీ అధికారులు రద్దు చేశారు.  సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేసిన టీటీడీ.. సెప్టెంబరు 10నుంచి ఆ 3వేల కోటాను రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మళ్లించింది.  రోజుకు 16వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా విక్రయిస్తున్నారు. వీటితో పాటు వీఐపీలకు బ్రేక్‌ దర్శనాలు, శ్రీవాణి ట్రస్టుకు రూ.10వేలు విరాళాన్ని ఇచ్చిన భక్తులకు, బోర్డు సభ్యుల సిఫారసుపై రూ.300 సుపథం ప్రవేశం, రూ.వెయ్యితో ఆన్‌లైన్‌ కల్యాణోత్సవం టికెట్లు కొన్నవారికి ప్రస్తుతం దర్శనం చేయిస్తున్నారు. ఇలా స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజుకు 20వేలు దాటుతోంది. మొత్తమ్మీద ఏదో టికెట్టు కొనుగోలు చేస్తే కానీ శ్రీవారి దర్శనం లభించే పరిస్థితి లేదు. 

Updated Date - 2020-10-07T15:44:56+05:30 IST