షిర్డీ సంస్థాన్ ప్రతిపాదనపై టీటీడీ చైర్మన్ సమీక్ష
ABN , First Publish Date - 2020-09-26T23:00:27+05:30 IST
దేశంలోని ప్రముఖ దేవాలయాల వెబ్సైట్లలో ఇతర ఆలయాల వెబ్ సైట్ల వివరాలు పెట్టాలన్న షిర్డీ సంస్థాన్...
తిరుమల : దేశంలోని ప్రముఖ దేవాలయాల వెబ్సైట్లలో ఇతర ఆలయాల వెబ్ సైట్ల వివరాలు పెట్టాలన్న షిర్డీ సంస్థాన్ ప్రతిపాదనపై టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు. నకిలీ వెబ్సైట్లను అరికట్టడానికి ఈ విధానం ఉపయోగడుతుందని షిర్డీ సంస్థాన్ అధికారులు చెప్పిన విషయాలపై చర్చించారు. ఈ ప్రతిపాదనను సమీక్షించి నివేదిక ఇవ్వాలని టీటీడీ అధికారులను చైర్మన్ ఆదేశించారు.
టీటీడీలో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేశామని.. తద్వారా 18 నకిలీ సైట్లను గుర్తించి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. కోవిడ్-19 వ్యాప్తి నివారణ చేస్తూ తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న దర్శనం, ఇతర సదుపాయాలను పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా షిర్డీ సంస్థాన్ అధికారులకు టీటీడీ వివరించింది. టీటీడీ నిర్వహిస్తున్న సామాజిక, ధార్మిక కార్యక్రమాలను షిర్డీ సంస్థాన్ అధికారులకు తెలియజేశారు.
గుడికో గోమాత ప్రారంభించాం..!
దేశవ్యాప్తంగా హిందూ ధర్మప్రచారాన్ని మరింత విస్తృతం చేయడానికి అన్ని ప్రముఖ హిందూ ఆలయాలతో కమిటీ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. ప్రముఖ ఆలయాల అధికారులతో ఫెడరేషన్ ఏర్పాటుకు నిర్ణయించారు. ఏడాదికి ఒకసారి సమావేశమై సమీక్షించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎం జగన్ సూచనలతో దక్షిణాది రాష్ట్రాల్లో గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. షిర్డీలోనూ గుడికో గోమాత ప్రారంభించాలని.. సంస్థాన్కు ఒక గోవును దానంగా అందిస్తామని ఆయన తెలిపారు.