బీజేపీ ‘దండు’యాత్రపై.. వైసీపీ శ్రేణుల్లో అలజడి
ABN , First Publish Date - 2020-07-10T08:46:42+05:30 IST
బీజేపీ ‘దండు’యాత్రపై.. వైసీపీ శ్రేణుల్లో అలజడి

అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): విజయసాయిరెడ్డిపై బీజేపీ నేతలు ఒక్కసారిగా దండయాత్ర చేయడం వైసీపీ శ్రేణుల్లో అలజడి రేపుతోంది. ఇన్నాళ్లుగా కమలనాథులతో సఖ్యత కొనసాగిస్తున్నామని.. ఇప్పుడు వారినే లక్ష్యంగా చేసుకుని వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శలు చేయడం.. ఆయనపై బీజేపీ నేతలు విమర్శలకు దిగడం తదితర పరిణామాలు వారిలో కలవరం కలిగిస్తున్నాయి. బీజేపీలోకి వచ్చిన టీడీపీ నేతలపై విజయసాయిరెడ్డి ఎన్ని విమర్శలు చేసినా, సెటైర్లు వేస్తున్నా నిన్నమొన్నటిదాకా బీజేపీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అనూహ్యంగా గురువారంవారు తీవ్రస్థాయిలో ప్రతిస్పందించడంతో రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. జాతీయ స్థాయిలో ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప.. పార్టీ సీనియర్ నేతలు సునీల్ దేవధర్, విష్ణువర్ధన్రెడ్డి వంటివారు స్పందించరని వైసీపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
ఇసుక, ఇళ్ల స్థలాల్లో అక్రమాలపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన పార్టీలో కొందరిపైనే విమర్శలు చేశారని.. బీజేపీ నేతలతోతో సన్నిహితంగా ఉంటున్న ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేయడమేగాక.. బీజేపీలో చేరిన నేతలను విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారని.. ఇది అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పిస్తుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు.