విశాఖలో విషాద వీచికలు

ABN , First Publish Date - 2020-05-08T11:32:16+05:30 IST

విశాఖను గ్యాస్‌ ప్రమాదాలు వెంటాడుతున్నాయి. గతంలోనూ హెచ్‌పీసీఎల్‌, స్టీల్‌ప్లాంట్‌లలో జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి.

విశాఖలో విషాద వీచికలు

నాడు ‘హెచ్‌పీసీఎల్‌’లో 60మంది మృత్యువాత..

2012లో ‘ఉక్కు’ పేలుడులో 19మంది మృతి 


విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి), మల్కాపురం, మే 7: విశాఖను గ్యాస్‌ ప్రమాదాలు వెంటాడుతున్నాయి. గతంలోనూ హెచ్‌పీసీఎల్‌,  స్టీల్‌ప్లాంట్‌లలో జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి. 1997 సెప్టెంబరు 14న హెచ్‌పీసీఎల్‌లో లిక్విడ్‌ పెట్రోలియం గ్యాస్‌ లీకై సంభవించిన విస్ఫోటంలో 60మంది మృత్యువాత పడ్డారు. సంస్థలోని భారీ స్పియర్స్‌లోకి నౌక నుంచి వచ్చిన గ్యాస్‌ను లోడింగ్‌ చేశారు. అనంతరం స్పియర్‌ దిగువనున్న వాల్వు లీక్‌ కావడంతో గ్యాస్‌ సంస్థ మొత్తం వ్యాపించింది. అది గుర్తించని ఓ ఉద్యోగి క్యాంటీన్‌లోకి వెళ్లి స్టవ్‌ వెలిగించడంతో పెద్దశబ్దంతో విస్ఫోటం సంభవించింది. ఈ ఘటనలో 60 మంది చనిపోయారు. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తేవడానికి 5రోజులు పట్టింది. ఆ తరువాతే గ్యాస్‌ లోడింగ్‌లో క్రమేపీ మార్పులు తీసుకొచ్చారు. ప్రస్తుతం విశాఖ రిఫైనరీలోనే భూగర్భంలో భారీ స్పియర్స్‌ ఉంచి వాటిలో గ్యాస్‌ నిల్వ చేస్తున్నారు. గ్యాస్‌ ఫిల్లింగ్‌ కోసం పెట్రోపార్కు వరకు  భూగర్భం నుంచే పైప్‌లైన్‌ వేశారు. గ్యాస్‌ లోడింగ్‌కు సాగరదుర్గా బీచ్‌ సమీపంలో సొరంగం తవ్వి ఫిల్లింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. దీనివల్ల భవిష్యత్తులోనే ప్రమాదాలు సంభవించవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


స్టీల్‌ప్లాంట్‌లో..

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 2012 జూన్‌ 13న గ్యాస్‌ ప్రెజర్‌ వల్ల సంభవించిన అగ్నిప్రమాదంలో 19మంది మృతిచెందారు. విస్తరణ పనుల్లో భాగంగా స్టీల్‌ మెటల్‌ షాప్‌లో ఉత్పత్తి పక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుండగా బ్లోయింగ్‌కు గ్యాస్‌ అందలేదు. దీంతో ఉక్కు అధికారులు, ఉద్యోగులు ప్రెజర్‌ రెగ్యులేటర్‌ స్టేషన్‌లో లోపాన్ని సరిదిద్దుతుండగా రాత్రి10గంటల సమయంలో పేలుడు సంభవించింది. 19మందిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మిగిలినవారు తీవ్రంగా గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు.

Updated Date - 2020-05-08T11:32:16+05:30 IST