హిందూ పండగలపై అలసత్వమా?

ABN , First Publish Date - 2020-09-14T08:09:36+05:30 IST

‘‘సీఎం గారూ.. హిందువుల పండగల పట్ల ఎందుకు అలసత్వం చూపుతున్నారు? ఇతర మతస్థుల పండుగలకు ప్రభుత్వమే నిధులిచ్చి మరీ ప్రేమ చూపుతోందెందుకు? ఏ

హిందూ పండగలపై అలసత్వమా?

సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ సూటి ప్రశ్న


న్యూఢిల్లీ/అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం గారూ.. హిందువుల పండగల పట్ల ఎందుకు అలసత్వం చూపుతున్నారు? ఇతర మతస్థుల పండుగలకు ప్రభుత్వమే నిధులిచ్చి మరీ ప్రేమ చూపుతోందెందుకు? ఏమిటీ వివక్ష? తిరుమల, శ్రీశైలం ఆలయాల్లో ఉచిత దర్శనాలను ఎందుకు తగ్గించారో ప్రజలకు చెప్పండి’’ అంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్‌ని నిలదీశారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. చర్చి అద్దాలు పగులగొట్టిన కేసులో 40 మందిని అరెస్ట్‌ చేసిన జగన్‌ ప్రభుత్వం, అంతర్వేది ఘటనలో ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.


హిందూ మతంపట్ల నిజంగా సీఎంకు విశ్వాసముంటే.. సతీసమేతంగా ఆయన దేవాలయాల పూజల్లో పాల్గొనాలని, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సీఎం దంపతులు పాల్గొని స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించాలని డిమాండ్‌ చేశారు. కేవలం ధనార్జనకోసమే దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం చేయడం సమంజసంకాదన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ‘సనాతన స్వదేశీ సేన’ పేరుతో సంస్థను నెలకొల్పినట్టు తెలిపారు. 


సీఎం, నేనూ చూసుకుంటాం!

సీఎం జగన్‌తో తనకున్న సంబంధం తెలుసుకోకుండా.. మధ్యలో ఎవరూ వాగొద్దని మంత్రి బొత్స సత్యనారాయణతో సహా ఇతర మంత్రులను రఘురామ హెచ్చరించారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తానని జగన్‌ హామీ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. తన రాజీనామా విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని.. చులకనగా వాగొద్దని హెచ్చరించారు. 

Updated Date - 2020-09-14T08:09:36+05:30 IST