పింఛన్లపై నిబంధనల పిడుగు!
ABN , First Publish Date - 2020-09-06T07:52:44+05:30 IST
సామాజిక పింఛన్లపై ప్రభుత్వం నిబంధనల కొరడా ఝళిపిస్తోంది. లబ్ధిదారుల
![పింఛన్లపై నిబంధనల పిడుగు!](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
తొలగింపే లక్ష్యంగా సర్కారు సాకులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సామాజిక పింఛన్లపై ప్రభుత్వం నిబంధనల కొరడా ఝళిపిస్తోంది. లబ్ధిదారుల తగ్గింపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. విద్యుత్ వాడకం 300 యూనిట్లు దాటిందనో, పెన్షన్దారుల రేషన్కార్డులో సభ్యులకు 4 చక్రాల వాహనాలు ఉన్నాయనో, ఆదాయపన్ను కడుతున్నారనో పేర్కొంటూ పింఛన్ల కు కత్తెరవేస్తోంది. ఈ నెలలో భారీ సంఖ్యలో పెన్షన్దారులను తొలగిస్తూ ఓ జాబితా సిద్ధంచేశారు. దీనిని క్షేత్రస్థాయికి పంపారు.
అయితే, ఎప్పటి లాగానే పెన్షన్ కోసం ఎదురుచూసిన లబ్ధిదారులు ఈ జాబితా చూసి ఉలిక్కిపడ్డారు. గతంలో పెన్షన్లపై కసరత్తు చేసిన సందర్భంలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే, అప్పట్లో లబ్ధిదారులను భారీసంఖ్యలో తొలగిస్తున్నారన్న విమర్శలు రావడంతో సర్కారు వెనక్కితగ్గింది. ఆ తర్వాత కరోనా నేపథ్యంలో దీని జోలికి వెళ్లలేదు. పైగా కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేశారు.
అయితే, తాజాగా ‘తాత్కాలికం’ పేరుతో తొలగింపుల జాబితా గ్రామ, వార్డుసచివాలయాలకు రావడంతో పెన్షన్దారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పింఛన్ల తొలగింపునకు సంబంధించి ప్రభుత్వం పేర్కొన్న కారణాలు చాలా మంది విషయంలో కనిపించలేదు. అయినప్పటికీ తొలగింపు జాబితాలో పేరు ఉండడంతో లబోదిబోమంటున్నారు. సాధారణంగా పెన్షన్లకు సంబంధించి గ్రీవెన్స్కు ఎంపీడీవో లాగిన్లో పరిష్కారమవుతాయి.
అయితే, ఎంపీడీవోలకు కూడా వాటి పరిష్కారానికి సంబంధించిన సమాచారం రాలేదు. ప్రభుత్వం స్పందించి ఎంపీడీఓలకు ఆదేశాలు ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.