వ్యవసాయ చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదు: జీవీఎల్

ABN , First Publish Date - 2020-12-27T18:28:41+05:30 IST

మూడు వ్యవసాయ చట్టాలు.. విప్లవాత్మక చట్టాలని బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహరావు వ్యాఖ్యానించారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదు: జీవీఎల్

అమరావతి: నూతన వ్యవసాయ చట్టాలు.. విప్లవాత్మకమైనవని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను పరిష్కారించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో రైతు సాధికారిత సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో బీజేపీ ఎంపీ జీవీఎల్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, కన్నా లక్ష్మీ నారాయణ, నాయకులు కార్యకర్తలు, రైతులు భారీగా పాల్గొన్నారు. ఈసందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ.. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ చట్టాలు చేశారన్నారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని గట్టేక్కించేందుకు నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారని స్పష్టం చేశారు. ముప్పై ఏళ్ల క్రితం ఇవి వచ్చి ఉంటే రైతులు ఎంతో లాభపడేవారని ప్రకటించారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని మార్పు చేస్తామని చెప్పారు. కానీ ఈ ‌చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 


మార్కెట్ యార్డ్‌లు మూసి‌వేస్తామనడం సరికాదన్నారు. రైతులు తమ పంటను భారతదేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని పేర్కొన్నారు. ఈ చట్టాలతో రైతుకు కనీస మద్దతు ధర లభిస్తుందని చెప్పారు. గతం కంటే రెండు రెట్లు రైతుకు ధర వస్తుందనేది‌ వాస్తవమన్నారు. ఎప్పుడయినా భూ హక్కు రైతుకే ఉంటుందని వెల్లడించారు. భూమి లాగేసుకుంటారని  ప్రతిపక్షాలు అసత్యం ప్రచారం చేశాయని మండిపడ్డారు. ప్రతిపక్షాల ఆరోపణలు నమ్మొద్దన్నారు. రైతులకు మేలు‌చేసే ఈ చట్టాలను అందరూ స్వాగతించాలని జీవీఎల్ పేర్కొన్నారు.  

Updated Date - 2020-12-27T18:28:41+05:30 IST