ఈ విపత్కర స్థితిలో 3పై ముందుకొద్దు
ABN , First Publish Date - 2020-03-27T08:12:42+05:30 IST
‘అమరావతి పరిరక్షణ ఉద్యమానికి గురువారం 100వ రోజు. ఒకవైపు కరోనా ప్రమాదం తీవ్రంగా ఉన్నా.. ముందు జాగ్రత్తలు తీసుకుంటూ, వేలాది కుటుంబాలు చేస్తున్న...
- అసలే ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం
- హేతుబద్ధంగా వెళ్లకపోతే భవిష్యత్ అంధకారమే!
- త్యాగాలను గుర్తించకుంటే చరిత్ర క్షమించదు
- ప్రభుత్వానికి చంద్రబాబు వినతి
- రైతులను ఆదుకోవాలని సీఎస్కు లేఖ
అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ‘అమరావతి పరిరక్షణ ఉద్యమానికి గురువారం 100వ రోజు. ఒకవైపు కరోనా ప్రమాదం తీవ్రంగా ఉన్నా.. ముందు జాగ్రత్తలు తీసుకుంటూ, వేలాది కుటుంబాలు చేస్తున్న ఉద్యమం వెనుక చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలి. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం ముందుకెళ్లరాదు’ అని ప్రతిపక్షనేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. వేలసంఖ్యలో అక్రమ కేసులు, అడుగడుగునా నిర్బంధాలు, వేధింపులు, అవమానాల్లో కూడా పట్టుదలగా ఉద్యమిస్తున్న రైతులు, మహిళలను చంద్రబాబు ఒక ప్రకటనలో అభినందించారు. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించిన అవమానకర పరిస్థితిలో ముందుకొచ్చి రాజధాని కోసం 34వేల ఎకరాల భూమిని ఉదారంగా అందించిన రైతుల త్యాగానికి తగిన ఫలితం లేకపోతే చరిత్ర క్షమించదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రయోజనం, తమ కుటుంబాలకు మేలు జరగుతుందని, ఉభయతారకంగా ఉంటుందని భావించిన వారి ఆశలను మొగ్గలోనే తుంచేయడం అటు రైతులకూ, ఇటు రాష్ట్రానికీ క్షేమకరం కాదని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైందని, లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి పోయాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటి దుష్ప్రభావం యువత ఉపాధి అవకాశాలపై పడిందన్నారు. మూడు రాజధానుల నిర్ణయంతో రాష్ట్ర భవిష్యత్ పూర్తిగా అంధకారం అవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం హేతుబద్ధంగా ఆలోచించాలని సూచించారు.
రైతులను ఆదుకోవాలి
కరోనా కారణంగా మార్కెట్ మాంద్య ం, ఎగుమతులు, రవాణా సంక్షోభం వల్ల మద్దతు ధరలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ నీలం సాహ్నికి లేఖ రాశారు.