దేవదాయ మంత్రి ఇంటి సమీపంలో చోరీ
ABN , First Publish Date - 2020-12-19T07:25:38+05:30 IST
రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న కుసుమ హరనాథ మందిరంలో భారీ చోరీ
కుసుమ హరనాథ మందిరంలో వెండి ఆభరణాలు మాయం
విజయవాడ/వన్టౌన్, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న కుసుమ హరనాథ మందిరంలో భారీ చోరీ జరిగింది. మందిరంలో విగ్రహాల వెనుక ఉన్న ట్రంక్లో పెట్టెలో ఉండే వెండి ఆభరణాలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. విజయవాడ వన్టౌన్ బ్రాహ్మణ వీధిలో మంత్రి నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటికి వెళ్లే మార్గంలో కేఆర్ బ్యాంగిల్స్ ఎదురుగా ఉన్న శేషయ్య వీధిలో కుసుమ హరనాథ మందిరం ఉంది. శుక్రవారం అర్చకులు యథావిధిగా మందిరాన్ని తెరిచి చూసేసరికి, విగ్రహాలు ఉన్న మందిరం గడియలు ఊడిపోయి, లోపల పూజసామగ్రి చెల్లాచెదురుగా పడి ఉంది. విగ్రహాల వెనుక ఉన్న ట్రంక్ పెట్టెలో ఉన్న ఆరు కిలోల వెండి ఆభరణాలు కనిపించలేదు. వాటి విలువ రూ.4లక్షలు ఉంటుందని అంచనా.