ప్రధానోపాధ్యాయుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-13T08:56:33+05:30 IST
అనంతపురం జిల్లా పరిగి మండలం విట్టాపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం(57) బలవన్మరణానికి

‘నాడు-నేడు’ పనుల ఒత్తిడే కారణమా?
పరిగి(హిందూపురం టౌన్), డిసెంబరు 12: అనంతపురం జిల్లా పరిగి మండలం విట్టాపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం(57) బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబంలో ఎలాంటి సమస్యలూ లేవని, పాఠశాలలో నాడు-నేడు పనుల ఒత్తిడి వల్లే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హెచ్ఎం సుబ్రహ్మణ్యం హిందూపురంలో నివాసముంటూ విట్టాపల్లిలో పనిచేస్తుండేవారు. శనివారం పాఠశాలకు వెళ్తానని హిందూపురం నుంచి బయల్దేరారు. దారిలో కాలువపల్లి, పరిగి గ్రామాల మధ్య ఒంటిపై పెట్రోల్ పోసుకుని, ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో నాడు-నేడు పనుల బాధ్యత హెచ్ఎంలకు అప్పగించింది. నాడు-నేడు పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలి. కంప్యూటర్పై అవగాహనలేని సుబ్రహ్మణ్యం ఈ విషయంలో ఇబ్బందిపడుతుండేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ పనుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటారని ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హిందూపురం రూరల్ సీఐ ధరణికిశోర్ తెలిపారు.