సిమెంటు భగభగ

ABN , First Publish Date - 2020-05-11T09:11:40+05:30 IST

సిమెంటు ధర మండిపోతోంది. బస్తాకు ఏకంగా రూ.70 వరకూ పెరగడంతో నిర్మాణరంగం పరిస్థితి నిప్పుల కొలిమిలో పడినట్లయింది. ఇప్పటికే లాక్‌డౌన్‌ కారణంగా

సిమెంటు భగభగ

  • బస్తాకు రూ.70వరకూ పెరిగిన ధర 
  • లాక్‌డౌన్‌తో కుదేలైన నిర్మాణ రంగం..
  • ఇప్పుడు ధర పెంపుతో పూర్తి స్తబ్దత  
  • ఇసుక, సిమెంటు రేట్లు ఆకాశంలోకి..
  • నేలచూపులు చూస్తున్న అమ్మకాలు 
  • పీకల్లోతు కష్టాల్లో నిర్మాణదారులు..
  • 40లక్షల మంది కార్మికులకూ గడ్డుకాలం


 అమరావతి, మే 10 (ఆంధ్రజ్యోతి): సిమెంటు ధర మండిపోతోంది. బస్తాకు ఏకంగా రూ.70 వరకూ పెరగడంతో నిర్మాణరంగం పరిస్థితి నిప్పుల కొలిమిలో పడినట్లయింది. ఇప్పటికే లాక్‌డౌన్‌ కారణంగా అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు లేక ఆదాయం పూర్తిగా పడిపోయింది. వాస్తవానికి అంతకుముందు కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇసుకకు ధర పెట్టడం, ఇసుక కొరతతో పెరిగిన ధరలు, మూడు రాజధానుల నిర్ణయంతో ఎక్కడికక్కడ అమ్మకాలు నిలిచిపోవడంతో నిర్మాణదారులు కుదేలయ్యారు. చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అప్పులు చేయాల్సి రావడం, వాటికి పెరుగుతున్న వడ్డీలు.. ఇవన్నీ పడలేక కొందరు హైదరాబాద్‌కు తరలిపోయారు. మరికొందరు అసలు ఈ రంగమే వదిలేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాతో పరిస్థితి మరింత దిగజారింది.


ఇప్పుడు లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చి కొంతమేర నిర్మాణాలు ప్రారంభిద్దాం అనుకునేసరికి సిమెంటు ధర ఆకాశాన్నంటుతోంది. కంపెనీని బట్టి ఒక్కో బస్తా రేటు రేటు రూ.70వరకు పెరిగింది. గతంలో రూ.250 ఉన్నది ఇప్పుడు రూ.320కి, గతంలో రూ.300 ఉన్న బ్యాగ్‌ ఇప్పుడు రూ.370 అయింది. దూరాభారాన్ని బట్టి దాదాపు రూ.400కు కూడా చేరుతోంది.  రాష్ట్రంలో నిర్మాణ రంగంపై ఆధారపడిన సుమారు 20 వృత్తుల వారు దాదాపు 40లక్షల మంది ఉన్నారని అంచనా. ఇంతమందికి ఉపాధి కల్పించాల్సిన నిర్మాణదారులు బేలచూపులు చూస్తున్నారు. మోయలేనంత భారంగా ఉన్నా ప్రాజెక్టులు పూర్తిచేద్దామని అనుకున్నవారు.... ధరల పెరుగుదలతో మరింత బెంబేలెత్తిపోతున్నారు. 


కరోనా కారణంగా సుమారు 50రోజులు సిమెంటు అమ్మకాలే లేవు. నిర్మాణ రంగం మొత్తం స్తంభించిపోయింది. అన్ని రకాలుగా ఇబ్బందుల్లో చిక్కుకున్న నిర్మాణదారులు చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయలేని స్థితిలోకి వెళ్లిపోయారు. అయినా వాటిని అర్ధాంతంగా ఆపేస్తే అప్పులు, వడ్డీలు, ఖర్చులు పెరిగి మరింత ఆర్థికభారం అవుతుందనే భయంతో ఏదోవిధంగా పూర్తిచేద్దామనే తలంపుతో ఉన్నారు. ఇలాంటి సమయంలో వారిని ఆదుకోవడానికి రాయితీలు ఇవ్వడం, వీలైతే ధరలు తగ్గేలా ప్రభుత్వం చూడాల్సి ఉంది. కానీ దీనికి రివర్స్‌లో ధరలు పెరగడంతో నిర్మాణదారులు హతాశులవుతున్నారు. 

Updated Date - 2020-05-11T09:11:40+05:30 IST