హైకోర్టు నిగ్రహం పాటించాలి
ABN , First Publish Date - 2020-10-03T07:28:29+05:30 IST
దేశంలో మిగిలిన రాష్ట్రాల్లోని ఉన్నత న్యాయస్థానాల తరహాలోనే, రాష్ట్రంలోనూ హైకోర్టు నిగ్రహం పాటించాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల
రికార్డు లేకుండా వ్యాఖ్యానించడం సరికాదు
అది ప్రభుత్వం, పార్టీ హక్కును హరించడమే
వ్యాఖ్యలను తీర్పులో భాగంగానే చేయాలి: సజ్జల
అమరావతి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): దేశంలో మిగిలిన రాష్ట్రాల్లోని ఉన్నత న్యాయస్థానాల తరహాలోనే, రాష్ట్రంలోనూ హైకోర్టు నిగ్రహం పాటించాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని, ఇలాగైతే తమ అధికారాలను వినియోగిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించడం తీవ్రమైన అంశమన్నారు. హైకోర్టు తన వ్యాఖ్యలను రికార్డు చేయకుండా, మౌఖికంగా స్పందించడం వల్ల రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి, ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లే హక్కు పోతుందని పేర్కొన్నారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఏ వ్యవస్థకు కూడా ప్రత్యేకాధికారాలు ఇవ్వలేదు. ఇందులో ఒక వ్యవస్థ.. తాను ఆత్మనిగ్రహం పాటించడంతోపాటు మరో వ్యవస్థను గౌరవిస్తేనే సమతూకం ఉంటుంది. అలాకాకుండా ఒకవ్యవస్థ ఇంకో వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం సరికాదు. కోర్టు చేసినవి కేవలం వ్యాఖ్యలు.
న్యాయస్థానాలు ఇలాంటి వ్యాఖ్యలు చేయాలనుకుంటే వాటిని రికార్డు చేయాలి. అంటే తీర్పులో పార్టుగా చెప్పాలి. అప్పుడు ప్రభుత్వపరంగానైనా సరే, లేదంటే పార్టీపరంగానైనా సరే.. సదరు వ్యాఖ్యలను రికార్డుల్లోంచి తీసేయమని మేం అత్యున్నత న్యాయస్థానానికి పోవడానికి వీలుంటుంది. కోర్టులు మౌఖికవ్యాఖ్యలు చేయడంవల్ల ఆహక్కు మాకు లేకుండాపోతుంది’’ అని సజ్జల పేర్కొన్నారు.