అనంతపురం జిల్లాలో మిడతల కలకలం
ABN , First Publish Date - 2020-05-30T22:43:47+05:30 IST
కరోనా విపత్తు తొలగిపోకముందే మరో మహావిపత్తు ముంచుకొచ్చింది. అది వైరస్ అయితే ఇది ఓ ఎడారి పురుగు. దేశంలో 1997 తర్వాత మళ్లీ ఇప్పుడు మిడతలు దాడి చేస్తున్నాయి.
అనంతపురం: కరోనా విపత్తు తొలగిపోకముందే మరో మహావిపత్తు ముంచుకొచ్చింది. అది వైరస్ అయితే ఇది ఓ ఎడారి పురుగు. దేశంలో 1997 తర్వాత మళ్లీ ఇప్పుడు మిడతలు దాడి చేస్తున్నాయి. తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి ఇరాన్, పాకిస్తాన్ మీదుగా దేశంలోకి ప్రవేశించాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్రను దాటి తెలుగు రాష్ట్రాలవైపు దూసుకువస్తున్నాయి. దీంతో తీవ్ర ఆందోళన మొదలైంది. అనంతపురం జిల్లాలోని అమరాపురంలో మిడతల కలకలం రేపుతున్నాయి. వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద జిల్లేడు చెట్లపై మిడతల దండు ప్రత్యక్షమైంది. దీంతో స్థానిక రైతాంగం ఆందోళన చెందుతోంది. సంతానోత్పత్తి తర్వాత ఆహార అన్వేషణ కోసం గుంపులుగా వలస వస్తాయి. ఎంత విపరీతంగా పంటలను తింటాయి అంటే.. ఒక చదరపు కిలోమీటర్ మేర ఉన్న మిడతల దండు ఒక్క రోజులో 35 వేల మంది తినే ఆహారాన్ని తింటాయి. మిడతలు దాడి చేసిన పంట మాత్రం సర్వ నాశనమే. అసలు అక్కడ పచ్చటి పంట ఉండేదనడానికి ఆనవాళ్లే మిగలవు. ప్రపంచంలోనే అత్యంత వినాశకరమైన వలస తెగులుగా నిపుణులు వీటి గురించి చెబుతారు.