జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలి: టీడీపీ ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-07-19T18:07:43+05:30 IST
కరోనా కల్లోలంలో తమ కుటుంబాల్ని పోషించుకునేందుకు జర్నలిస్టులు..

శ్రీకాకుళం జిల్లా: కరోనా కల్లోలంలో తమ కుటుంబాల్ని పోషించుకునేందుకు జర్నలిస్టులు తీవ్ర అవస్ధలు పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లోను విధులు నిర్వహిస్తూ కరోనాతో ముగ్గురు జర్నలిస్టులు మరణించారని, మరికొంత మంది ఆస్పత్రులలో చికిత్సపొందుతున్నారని అన్నారు. మరణించినవారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం రూ. 50 లక్షల భీమా సౌకర్యం కల్పించటంతో పాటు ప్రత్యేకంగా ఆర్థిక సాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులకు పీపీఈ కిట్లు, మాస్కులు ప్రభుత్వం ఉచితంగా అందజేయాలన్నారు.
కరోనా వైరస్ సోకి చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒడిషా ప్రభుత్వం రూ. 15 లక్షల ఆర్ధిక సాయం అందజేస్తోందని ఎమ్మెల్యే అశోక్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం జర్నలిస్టుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. కేంద్రం ప్రకటించిన ప్రధానమంత్రి గరీభ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద ఇస్తున్న రూ. 50 లక్షల భీమా పరిధిలోకి గ్రామ, వార్డు వాలంటీర్లను చేర్చిన వైసీపీ ప్రభుత్వం ఆ భీమాను జర్నలిస్టులకు ఎందుకు వర్తింపజేయటం లేదని ప్రశ్నించారు. వాలంటీర్లకు ఇచ్చే ప్రాధాన్యత ఈ ప్రభుత్వం జర్నలిస్టులకు ఎందుకివ్వటం లేదన్నారు. రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో పాత్రికేయుల సమస్యల పట్ల ప్రభుత్వం తక్షణం స్పందించాలని ఎమ్మెల్యే అశోక్ డిమాండ్ చేశారు.
,