మూడు రాజధానులపై..ప్రభుత్వానికే సంపూర్ణాధికారం!

ABN , First Publish Date - 2020-12-10T09:00:16+05:30 IST

మూడు రాజధానులపై నిర్ణయం తీసుకునే సంపూర్ణాధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే

మూడు రాజధానులపై..ప్రభుత్వానికే సంపూర్ణాధికారం!

రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఆ చట్టాలు

ఇందులో కోర్టు జోక్యం చేసుకోరాదు:  సీనియర్‌ న్యాయవాది దవే 


అమరావతి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): మూడు రాజధానులపై నిర్ణయం తీసుకునే సంపూర్ణాధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను, వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని తీసుకొచ్చిందని, సీఆర్‌డీఏ రద్దు చట్టంలో రాజధానికి భూములిచ్చిన రైతుల హక్కులకు రక్షణ కల్పించిందని తెలిపారు. రాజధాని అంశాలకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రోజువారీ తుదివిచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలు ముగియడంతో మంగళవారం రాష్ట్రప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు ప్రారంభించి.. బుధవారం కూడా కొనసాగించారు.


గత ప్రభుత్వం రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల అండతో అమరావతిని రాజధానిగా నిర్ణయించిందని, శివరామకృష్ణన్‌ కమిటీ చేసిన సిఫారసులను పట్టించుకోకుండా తొందరపాటు నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలు రాజ్యాంగ నిబంధనలకు లోబడే చేశారని, ఎక్కడా ఉల్లంఘన జరగలేదన్నారు. మూడు కమిటీలతో అధ్యయనం చేయించిన తర్వాతే ఆ రెండు చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. అందువల్ల ఆ చట్టాల విషయంలో జోక్యం చేసుకోరాదని అభ్యర్థించారు. అనంతరం అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు ప్రారంభించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా నాటి ప్రభుత్వం రాజధాని ఏర్పాటుపై నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఆయన వాదనల కొనసాగింపునకు ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Updated Date - 2020-12-10T09:00:16+05:30 IST