అపెక్స్ కౌన్సిల్దే అంతిమ నిర్ణయం
ABN , First Publish Date - 2020-10-24T08:52:11+05:30 IST
రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, వినియోగం విషయంలో అపెక్స్ కౌన్సిల్దే అంతిమ నిర్ణయమని కేంద్ర జలవనరుల శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు స్పష్టం

డీపీఆర్, అనుమతులు లేకుండా ఏ ప్రాజెక్టూ చేపట్టరాదు
పాతవాటికి మార్పులు చేస్తే కొత్తవిగా పరిగణన: కేంద్రం
అక్టోబరు 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ మినిట్స్ వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, వినియోగం విషయంలో అపెక్స్ కౌన్సిల్దే అంతిమ నిర్ణయమని కేంద్ర జలవనరుల శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు స్పష్టం చేసింది. కొత్త ప్రాజెక్టులేవి చేపట్టినా గోదావరి, కృష్ణా నదీ జలాల బోర్డులు సాంకేతికంగా ఆమోదించిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతి లభించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. అక్టోబరు 6న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినిట్స్ను శుక్రవారం ఆ శాఖ రెండు రాష్ట్రాలకూ పంపింది. మినిట్స్ ప్రకారం.. కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ-2) అవార్డు కోర్టు వివాదంలో ఉన్నందువల్ల తొలి ట్రైబ్యునల్ కేటాయింపులే వర్తిస్తాయని కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రెండు రాష్ట్రాలకు సమావేశంలో స్పష్టం చేశారు.
కాగా, రెండు రాష్ట్రాలూ సీడబ్ల్యూసీకిగానీ, బోర్డులకు కానీ ఎలాంటి డీపీఆర్లు సమర్పించకుండానే ఒకరి ప్రాజెక్టులపై మరొకరు ఫిర్యాదులు చే సుకుంటున్నాయని జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి అపెక్స్ కౌన్సిల్కు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదిపై 15, గోదావరిపై 4 ప్రాజెక్టులు చేపట్టగా.. తెలంగాణ కృష్ణా నదిపై 8, గోదావరిపై 7 ప్రాజెక్టులు చేపట్టాయని, డీపీఆర్లు పదేపదే అడిగినా కూడా ఇవ్వట్లేదని తె లిపారు. మొత్తం ఈ 34 ప్రాజెక్టుల్లో తెలంగాణలో కేవలం రెండు ప్రాజెక్టులకే హైడ్రాలజీ, అంతర్ రాష్ట్ర అనుమతులు ఉన్నాయని, మరో రెండు ప్రాజెక్టులను పునర్విభజన చట్టంలో చేర్చారని ఆయన తెలిపారు.
కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్నాయిగానీ నీటి లభ్యత తక్కువ ఉందని.. ఉన్న ప్రాజెక్టుల ద్వారా నీటి నిర్వహణను సమర్థంగా చేపడితేకొత్త ప్రాజెక్టులకు పునఃకేటాయింపులు చేయొచ్చని పేర్కొన్నారు. గోదావరి బేసిన్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టే ముందు.. అనుమతులు పొందిన ప్రాజెక్టులను తొలుత పూర్తిచేయాలని సూచించారు.
సీఎంల వాదనలివి...
తెలంగాణ ఏర్పడి ఏడు సంవత్సరాలైనా కృష్ణా నదీజలాల్లో తెలంగాణ వాటా ఏమిటో తెలియదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ సమావేశంలో చెప్పినట్లు మినిట్స్ పేర్కొంది. గోదావరి ఎత్తిపోతల పథకం కొత్తది కాదని, దీనిపై ఏపీకి ఫిర్యాదు ఉంటే ట్రైబ్యునల్కు రాసుకోవచ్చని చెప్పారు. పోతిరెడ్డి ప్రాజెక్టుకు ఎలాంటి నదీజలాలూ కేటాయించలేదని, దాన్ని కొనసాగిస్తే తాము కూడా అలంపురంవద్ద 3 టీఎంసీల ప్రాజెక్టు చేపడతామని ఆయన హెచ్చరించారు.
రాయలసీమ పథకం ద్వారా అదనపు నీరు ఏమీ ఉపయోగించడం లేదని, ఏపీకి కేటాయించిన జలాల్నే వాడుకుంటున్నామని.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాదించారు. బోర్డులు నీటివాటాను నిర్ణయించలేవని, ట్రైబ్యునళ్లు మాత్రమే ఆ పనిచేస్తాయని తెలిపారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి రిజర్వాయర్లు అయినందువల్ల బోర్డుల పరిధిని నోటిఫై చేయాలని ఆయన కోరారు.