ఆ 72 ఏళ్ల వ్యక్తి 24 మందిని కలిశారు...
ABN , First Publish Date - 2020-04-03T12:16:06+05:30 IST
ఆ 72 ఏళ్ల వ్యక్తి 24 మందిని కలిశారు...
తూర్పుగోదావరి: రాజమహేంద్రవరానికి చెందిన 72 ఏళ్ల వ్యక్తి ఇటీవల ఢిల్లీ సమావేశానికి వెళ్లి రాగా ఈయనకు మార్చి 30న కరోనా సోకింది. ప్రస్తుతం విశాఖపట్నం విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఢిల్లీ సమావేశానికి వెళ్లి వచ్చిన తర్వాత ఈయన 16 మంది కుటుంబ సభ్యులను, బయట వ్యక్తులు 8 మందిని కలిశారు. అయితే కలిసిన 16 మంది కుటుంబ సభ్యుల్లో తన కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు ఉండగా, వీరిలో వృద్ధుడి కొడుకు మినహా మిగిలిన ముగ్గురికి వైరస్ వ్యాపించింది. ఈమేరకు బుధవారం రాత్రి వైద్య నివేదికలు ధ్రువీకరించాయి. అలాగే ఈ ముగ్గురు ఎనిమిది మందిని కలిసినట్టు వైద్యశాఖ వెల్లడించింది. కాగా తన తండ్రిని రాజమహేంద్రవరంలో కలిసి వచ్చిన తర్వాత కొత్తపేట మండలంలో 200 మందికి విందు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో వారిని రావులపాలెంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్కు పంపారు. కానీ స్థానికులు ఆందోళన చేయడంతో భట్లపాలెం కాలేజీ క్వారంటైన్కు తరలించారు. ఆ 33 మందిపై కొనసాగుతున్న పర్యవేక్షణ... జిల్లా నుంచి ఢిల్లీ సమావేశాలకు వెళ్లినవారు 35 మందిగా జిల్లా వైద్య శాఖ నిర్దారించింది. వీరిలో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నట్టు గుర్తించారు. దీంతో 33 మందిపై వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇప్పటికే వీరు ఎవరెవరిని జిల్లాలో కలిశారనేది ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. అటు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారిలో ఇప్పటికే ముగ్గురికి వైరస్ సోకడంతో మిగిలిన వారు ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారనేది నివేదిక సిద్ధం చేశారు. ఇక కొత్తపేటలో ఓకేసారి మూడు పాజిటివ్ కేసులు రావడంతో వైద్య, పోలీసుశాఖలు అలర్ట్ అయ్యాయి. మూడు కిలోమీటర్ల మేర రెడ్జోన్గా ప్రకటించి అప్రమత్తమయ్యారు. కలెక్టర్ మురళీధర్రెడ్డి, మంత్రి విశ్వరూప్ పరిస్థితులను సమీక్షించారు.