మా వాళ్లను పంపినందుకు థ్యాంక్స్
ABN , First Publish Date - 2020-05-09T09:16:23+05:30 IST
కర్ణాటకలో చిక్కుకుపోయిన ఏపీ మత్స్యకారులను తాను కోరినట్లుగా స్వస్థలాలకు తరలించడంపై ఆ రాష్ట్ర సీఎం యడియూరప్పకు టీడీపీ అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
![మా వాళ్లను పంపినందుకు థ్యాంక్స్](https://media.andhrajyothy.com/appimg/galleries/202005090339399/05092020035208n41.jpg)
యడియూరప్పకు చంద్రబాబు ట్వీట్
అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో చిక్కుకుపోయిన ఏపీ మత్స్యకారులను తాను కోరినట్లుగా స్వస్థలాలకు తరలించడంపై ఆ రాష్ట్ర సీఎం యడియూరప్పకు టీడీపీ అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. ఉడిపి జిల్లాలో ఏపీకి చెందిన 300కుపైగా మత్స్యకారులు చిక్కుకుపోయారని, వారిని స్వస్థలాలకు పంపాలని ఆయన ఇటీవల యడియూరప్పకు లేఖ రాశారు. వారిని ప్రత్యేక బస్సుల్లో శుక్రవారం అక్కడనుంచి స్వస్థలాలకు పంపారు. బీజేపీ నాయకురాలు శోభ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారిని దగ్గరుండి సాగనంపారు. దీంతో ముఖ్యమంత్రికి, శోభకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
ఔరంగాబాద్ ప్రమాదంపై బాబు సంతాపం
ఔరంగాబాద్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో వలస కూలీలు ప్రాణాలు కోల్పోవడంపై చంద్రబాబు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆపన్నులకు ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు: భువనేశ్వరి
సంక్షోభ సమయాల్లో ఆపన్నులకు సేవలందించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ, ప్రభుత్వ సూచనలను అనుసరిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 20వేల మంది పేద కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, వంట నూనె, పండ్లు, కోడిగుడ్లు, ఇతర నిత్యావసరాలు.., 3వేల మంది కూలీలు, వలస కార్మికులకు పులిహోర, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశామని తెలిపారు. 2.5లక్షల ఎస్ఎస్99 మాస్కులు పంపిణీ చేశామన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా 5వేల యూనిట్లు పంపిణీ చేసినట్టు వివరించారు.