మీ భాషలో ఇదీ మద్య నిషేధమేనా?
ABN , First Publish Date - 2020-10-31T08:06:06+05:30 IST
‘దశల వారీ మద్య నిషేధంలో భాగంగానే మద్యం రేట్లు పెంచామని ఇంతకాలం వైసీపీ ప్రభుత్వం డప్పు కొట్టుకొంది.
మద్యం ధరలపై టీడీపీ ప్రశ్న
అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ‘దశల వారీ మద్య నిషేధంలో భాగంగానే మద్యం రేట్లు పెంచామని ఇంతకాలం వైసీపీ ప్రభుత్వం డప్పు కొట్టుకొంది. ఇప్పుడు ధరలు తగ్గించింది. మీ భాషలో ఇది కూడా మద్య నిషేధమేనా’ అని టీడీపీ ప్రశ్నించింది. మద్యంపై ఆదాయం కోసం ప్రభుత్వం రకరకాల విన్యాసాలు చేసిందని మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ విమర్శించారు. ‘లాక్డౌన్ సడలించిన మరుక్షణమే కొంపలు అంటుకుపోతున్నట్లు మద్యం షాపులు తెరిచారు. దానిపై విమర్శలు రాగానే ధరలు పెంచారు. సీసా ముట్టుకోగానే షాక్ కొట్టాలనే ధరలు పెంచామని సీఎం జగన్ ఘనంగా చెప్పారు. మరి ఆ షాక్ ఎవరికి కొట్టిందని ఇప్పుడు ధరలు తగ్గించారు? ఇప్పుడు షాక్ గురించి మాట్లాడరేం’ అని ఆయన ప్రశ్నించారు.