కేశినేని విజ్ఞప్తిపై స్పందించిన యూనియన్ బ్యాంక్
ABN , First Publish Date - 2020-04-08T22:32:12+05:30 IST
టీడీపీ ఎంపీ కేశినేని నాని విజ్ఞప్తిపై యూనియన్ బ్యాంకు అధికారులు స్పందించారు.

విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని నాని విజ్ఞప్తిపై యూనియన్ బ్యాంకు అధికారులు స్పందించారు. లోన్ చెల్లింపులపై స్వయం ఉపాధి గ్రూపు సభ్యులపై ఒత్తిడి తీసుకురావొద్దని అధికారులను కోరగా సానుకూలంగా స్పందించారు. బకాయిల చెల్లింపుపై గ్రూపు సభ్యులపై ఒత్తిడి ఉండదని అధికారులు తెలిపారు. యూనియన్ కోవిడ్-19 సువిధ లోన్ కింద 5000 రూపాయలను కరోన సహాయక లోన్ కూడా పొందవచ్చని సూచించారు. ఆర్బీఐ జారీ చేసిన మారటోరియంకు యూనియన్ బ్యాంక్ కట్టుబడి ఉందని తెలిపారు. మార్చి 1, 2020 నుంచి మే 31, 2020 వరకు మారటోరియం అమలులో ఉంటుందన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల స్పందనపై కేశినేని హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
అంతకుముందు.. స్వయం ఉపాధి సంఘాల మహిళలపై లోన్స్ బకాయిలు చెల్లించాల్సిందిగా ఆంధ్రాబ్యాంక్ పార్వతీపురం శాఖ అధికారులు ఒత్తిడి తెచ్చారు. ఈ విషయాన్ని ఎం. సింహాచలం అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా ఎంపీ కేశినేని నాని దృష్టికి తీసుకువచ్చారు. యూనియన్ బ్యాంక్లో ఆంధ్రాబ్యాంక్ వీలీనమైన కారణంగా, యూనియన్ బ్యాంక్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.