ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్కు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లేఖ
ABN , First Publish Date - 2020-06-16T23:47:27+05:30 IST
ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్కు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లేఖ

గుంటూరు: ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్సభ స్పీకర్కు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై జయదేవ్ తన అభిప్రాయాలను లేఖలో ప్రస్తావించారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను, ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసిందని, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణపైనా కరోనా ప్రభావం కనిపిస్తోందని జయదేవ్ తెలిపారు. సామాజిక దూరం పాటిస్తూ లోకసభ, రాజ్యసభల నిర్వహణ ప్రస్తుతానికి అసాధ్యమని, దృశ్యశ్రవణ విధానంలో సభలు నిర్వహించాలని భావిస్తున్నట్లు పత్రికల్లో చూశానని ఎంపీ జయదేవ్ పేర్కొన్నారు. ఇది మంచి ఆలోచన, కానీ నెట్వర్క్, బాండ్విడ్త్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, సభ్యులంతా ఢిల్లీలోని వారి వారి నివాసాల్లో అందుబాటులో ఉండాలన్నది తన సూచన అని అన్నారు. అప్పుడు నెట్వర్క్ బాండ్ విడ్త్ సమస్యగా ఉండబోదని భావిస్తున్నానని, ప్రశ్నోత్తరాలు, బిల్లులపై చర్చల్లో పాల్గొనే వారిని మాత్రమే సభల్లోకి అనుమతించాలని, వారి ప్రశ్నలు, చర్చలు అయిన వెంటనే ఆ సభ్యులు సభ నుంచి బయటకు వచ్చేయాలని, చర్చలకు సంబంధించి మంత్రులు మాత్రమే సభలో ఉండాలని జయదేవ్ లేఖలో పేర్కొన్నారు. పది శాతం సభ్యుల హాజరు తగ్గకుండా ఉండేలా చూడాలని, బిల్లులపై ఓటింగ్ను దృశ్యశ్రవణ పద్ధతిలో నిర్వహించాలని, సామాజిక దూరం పాటిస్తే సెంట్రల్హాల్ 100 మందికి, లోక్సభలో 60 మంది సభ్యులకే వీలు ఉంటుందన్నారు. ప్రతి రాజకీయ పార్టీ నుంచి ఐదు అంత కంటే తక్కువ మంది సభకు వచ్చేలా తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని, సభ్యుల హాజరు నమోదుకు రిజిస్ట్రర్ ను పార్లమెంటు గేటు-1 వద్ద ఉంచాలని, సెలవు దినాలను రద్దు చేసి మొత్తం పార్లమెంటు వరుస రోజుల్లో నిర్వహించాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లేఖలో పేర్కొన్నారు.

