జగన్మోహన్రెడ్డీ.. సిగ్గుపడు!
ABN , First Publish Date - 2020-03-16T09:26:20+05:30 IST
ఎన్నికలు వాయిదా వేసిన ఈసీపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఆక్షేపించారు. కరోనాపై కనీసం దృష్టి పెట్టకుండా మొండిగా ముందుకెళ్తూ ప్రజల ఆరోగ్యంతో జగన్ చెలగాటమాడుతున్నారని టీడీపీ
- నువ్వు చేయాల్సిన పని ఈసీ చేసింది
- ఎన్నికల కమిషనర్కు కులం రంగా!
- క్విడ్ ప్రో కో చేస్తేనే నీకు మిత్రులా?
- సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ నేతలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): ఎన్నికలు వాయిదా వేసిన ఈసీపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఆక్షేపించారు. కరోనాపై కనీసం దృష్టి పెట్టకుండా మొండిగా ముందుకెళ్తూ ప్రజల ఆరోగ్యంతో జగన్ చెలగాటమాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ విమర్శించారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వమే ఎన్నికలను వాయిదా వేయాల్సిందని, కానీ ఆ పని ఎన్నికల కమిషనర్ చేసినందుకు ముఖ్యమంత్రి సిగ్గుపడాలని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా చట్టబద్ధంగా వ్యవహరించి, ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ జగన్కు శత్రువు అయితే, అదే సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ ప్రసాద్ ఎలా మిత్రుడయ్యారో జగన్ చెప్పాలని మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. క్విడ్ ప్రోకోకి పాల్పడితే మిత్రులు, రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తే శత్రువులా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్కు జగన్ కులం రంగు పులమడంపై టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్కు కులాన్ని ఆపాదించినందుకు కమ్మ సామాజికవర్గ మంత్రులు, ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికలకు రీనోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎంపీ కె.రామ్మోహన్నాయుడు, సీనియర్ నాయకులు యడ్లపాటి వెంకట్రావు, యనమల, ఎమ్మెల్సీలు అశోక్బాబు, దీపక్రెడ్డి, ఎమ్మెల్యే అనగాని, తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత ఈసీని కోరారు.