పంచభూతాలనూ పంచుకుతింటున్నారు
ABN , First Publish Date - 2020-06-04T08:52:12+05:30 IST
‘‘వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారు. ఆంధ్రలో బతికే పరిస్థితి లేదు’’ అని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. బుధవారం పలువురు నాయకులు వివిధ ప్రాంతాల్లో మీడియా సమావేశాల్లో, పత్రికా ప్రకటనల ద్వారా స్పందించారు.
![పంచభూతాలనూ పంచుకుతింటున్నారు](https://media.andhrajyothy.com/appimg/galleries/20200604030125/06042020032135n40.jpg)
- జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేతల ఫైర్
‘‘వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారు. ఆంధ్రలో బతికే పరిస్థితి లేదు’’ అని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. బుధవారం పలువురు నాయకులు వివిధ ప్రాంతాల్లో మీడియా సమావేశాల్లో, పత్రికా ప్రకటనల ద్వారా స్పందించారు. ప్రజలకు నవరత్నాలు పంచుతామని చెప్పిన వైసీపీ నేతలు పంచభూతాలను పంచుకుతింటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. భవిష్యత్లో దొంగలు పాలకులవుతారని బ్రహ్మంగారు చెప్పింది జగన్, వైసీపీ నేతల గురించేనన్నారు. వైసీపీ నేతలు లక్షల టన్నుల ఇసుకను రాష్ట్ర సరిహద్దును దాటించేశారని, అందుకే ఇప్పుడు అన్నిచోట్లా ఇసుక కొరత ఏర్పడిందని టీడీపీ అధికార ప్రతినిధి బొండా ఉమ ఆరోపించారు. ప్రతీ అంశంలో వైసీపీ నేతలు అయినకాడికి దోచుకొంటున్నారని, జగన్ పర్యవేక్షిస్తూ వాటాలు పంచుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో వైసీపీ దొంగలు పడ్డారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఎద్దేవాచేశారు. దళితుల హక్కులను కాలరాసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ మండిపడ్డారు. ఆచార్య ప్రేమానందం విషయంలో దోషులకు ప్రభుత్వం వత్తాసు పలకడం సిగ్గుచేటని మండిపడ్డారు. టీడీపీ పాలనలో దళితులు తలెత్తుకుని బతికితే, నేడుగొంతెత్తి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి విమర్శించారు. మాజీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు.