దశతోటి అధికారంలోకి వచ్చిన జగన్కు దిశలేదు: యనమల
ABN , First Publish Date - 2020-06-04T18:48:18+05:30 IST
దశతోటి అధికారంలోకి వచ్చిన జగన్కు దిశలేదు: యనమల
అమరావతి: జగన్ మాయమాటలు నమ్మిన ప్రజలు ఒక్కఛాన్స్ ఇచ్చి చూద్దాం అనే ఆయన్ని గెలిపించారని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు పాలన గుప్తుల స్వరయుగంలా ఉంటే జగన్ పాలన తుగ్లక్ పాలనతో సమానంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థను జగన్ అసలు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కనీస అవగాహనలేని వ్యక్తి సీఎంగా ఉండటం దురదృష్టకరమన్నారు. దశతోటి అధికారంలోకి వచ్చిన జగన్కు దిశలేదని... అందుకే అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. తన పాలననే విధ్వంసంతో ప్రారంభించాడన్నారు. ఆనాడు తుగ్లక్ ఆలోచనలకు కూడా ఆర్థికవ్యవస్థ సహకరించలేదని, నేడూ అంతే అని వ్యాఖ్యానించారు.
ఏవో కొన్ని కార్యక్రమాలు ప్రజలకు చేశామని చెప్పుకుంటున్నారు తప్ప ఆదాయమార్గాలన్నీ పడిపోయాయని ఆరోపించారు. ఆదాయ మార్గాలపై అన్వేషణ లేకపోవటం వల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తప్పవన్నారు. మాఫీయాలను ప్రోత్సహిస్తూ వ్యవస్థలనే నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రకృతి వనరులను దోచుకుంటున్నారన్నారు. న్యాయస్థానం తీర్పులను కూడా పట్టించుకోకుండా ఏదైనా చేయవచ్చనే నాయకుడు ఉండటం దురదృష్టకరమని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.