మర్చిపోతే ఎలా సాయన్నా... బుద్దా ట్వీట్
ABN , First Publish Date - 2020-03-08T20:25:04+05:30 IST
వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డికి టీడీపీ నేత బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

విజయవాడ: వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డికి టీడీపీ నేత బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. హవాలా, మనీ లాండరింగ్, ఈడీ లాంటి పదాలు ఉచ్ఛరించాడనికి సిగ్గుగా లేదా అని ఘాటుగా ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దోచేయడానికి అన్ని అడ్డదారులు తొక్కిన జగన్, విజయసాయిలు.. బ్యాంకుల గురించి మాట్లాడితే తాము చెవిలో పువ్వు పెట్టుకొని వినాలా? అని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడ స్కామ్ జరిగినా దాని వెనుక మూలం లోటస్ పాండ్లో ఉంటుందని విమర్శించారు. రస్ అల్ ఖైమాలో ఎవరు పట్టుబడినా ఇడుపులపాయ గ్యాంగ్ ఎందుకు వణుకుతుందన్నారు. బ్యాంకుల్ని, దేశాలని బురిడీ కొట్టించి నిర్మించిన అక్రమ సామ్రాజ్యంలో సేదతీరుతున్నారన్న విషయం మర్చిపోతే ఎలా సాయన్నా? అని బుద్దా ట్వీట్ చేశారు.
యస్ బ్యాంకు సంక్షోభంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించగా... దానిపై విజయసాయి రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆ బ్యాంకుపై చంద్రబాబుకు అంత ప్రేమ ఎందుకన్న రీతిలో విమర్శించారు. దేశంలో ఎక్కడ హవాలా, లాండరింగ్ బయటపడ్డా బాబు పేరు వినిపిస్తోందంటూ ట్వీట్ చేశారు.