‘రహస్య భేటీ’ వార్తలపై స్పందించిన సుజనా

ABN , First Publish Date - 2020-06-24T00:03:28+05:30 IST

పార్క్ హయత్ హోటల్‌లో ఏపీ ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌తో భేటీ వివాదంపై ఎంపీ సుజనా చౌదరి స్పందించారు.

‘రహస్య భేటీ’ వార్తలపై స్పందించిన సుజనా

అమరావతి: పార్క్ హయత్ హోటల్‌లో ఏపీ ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌తో భేటీ వివాదంపై ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. ఈ మేరకు రాష్ట్ర బీజేపీకి లేఖ రాశారు. సీనియర్ ఐఎఎస్ అధికారి రమేశ్ కుమార్ రహస్యంగా సమావేశమైనట్టు కొన్ని టీవీ ఛానళ్లలో ప్రసారాలు చేశారని, సదరు హోటల్లోని సీసీ టీవీ ఫుటేజ్‌ని కూడా టెలికాస్ట్ చేశారన్నారు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా పలువురు వైసీపీ నేతలు కూడా దీనిపై వారి స్థాయిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారన్నారు. 


ఆయన లేఖలో ఏమన్నారంటే.. 


‘‘అసలు వాస్తవమేంటంటే.. లాక్ డౌన్ తరువాత తన అధికార, వ్యాపార కార్యకలాపాలను బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్ నుంచి నిర్వహిస్తున్నాను. అక్కడే వివిధ రంగాలకు చెందిన అనేకమంది వ్యక్తులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు నన్ను కలుస్తున్నారు. అవి ఎంతమాత్రం కూడా రహస్య సమావేశాలు కాదు. నా కార్యకలాపాలను, సమావేశాలను రహస్యంగా నిర్వహించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఈ నెల 13న కామినేని శ్రీనివాస్ నన్ను కలవడానికి అపాయింట్ మెంట్ తీసుకున్నారు. అదే రోజు రమేశ్ కుమార్  కూడా నన్ను కలవాలని అడిగారు.  వారిద్దరు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు విషయాలపై నాతో సమావేశమయ్యారు. అవి ఎంతమాత్రం రహస్య సమావేశాలు కాదు. కామినేని గారితో ఏపీ పార్టీ వ్యవహారాలు మాట్లాడ్డం జరిగింది. రమేశ్ కుమార్ మా కుటుంబానికి ఎంతో కాలంగా మిత్రులు. ఆయనతో ప్రత్యేకించి ఇటీవల పరిణామాలు గానీ, ఆయన విధి నిర్వహణకు సంబంధించిన విషయాలు కానీ చర్చించలేదు. అయితే కొన్ని మీడియా సంస్థలు, కొందరు రాజకీయ నాయకులు సీసీ ఫుటేజ్ చూపించి తాము ముగ్గురం సమావేశమయ్యామని, ఏదో గూడుపుఠాని వ్యవహారం నడిపామని, ప్రసారం చేశాయి. చాలా తెలివిగా గడుసుగా ప్రజలకు భ్రమ కల్పించే ప్రయత్నం చేసాయి. రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడేవారు, వారి నేలబారు మనస్తత్వాలను బయటపెట్టుకున్నట్టే. నలుగురు కలిసి మాట్లాడుకుంటే కుట్రలు చేయడమే అనుకోవడం వారి దిగజారిన స్థాయిని తెలుపుతుంది. ఈ రకమైన బురద రాజకీయాలు చేసేవారితో గుంటలోకి దిగి వారితో కలబడి కుస్తీ పట్టడం నాకు అలవాటు లేదు, అది నా స్థాయి కాదు.  నేనెప్పుడూ ఓపెన్‌గానే ఉంటాను. నా రాజకీయాలు పారదర్శకంగా వుంటాయి. రహస్య కార్యకలాపాలు నేను చెయ్యను, చేయాల్సిన అవసరం నాకు లేదు’’ అని కుండబద్ధలు కొట్టారు. 

Updated Date - 2020-06-24T00:03:28+05:30 IST