జగన్పై ఈడీది ప్రత్యేక కేసు
ABN , First Publish Date - 2020-11-07T09:20:48+05:30 IST
జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్లపై శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగింది.
![జగన్పై ఈడీది ప్రత్యేక కేసు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సీబీఐతో కలపడం సరికాదు..
వేరుగా విచారించాల్సిందే
సీబీఐ కోర్టులో ఈడీ వాదనలు..
9కి తదుపరి విచారణ వాయిదా
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్లపై శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగింది. ఈడీ తరఫు న్యాయవాది సుబ్బారావు వాదనలు వినిపించారు. ఈడీ, సీబీఐ కేసులు వేర్వేరు అని ఆయన తెలిపారు. సీబీఐ కేసులతో సంబంఽధం లేకుండా ఈడీ కేసులను విచారించవచ్చున్నారు. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ నిధులు జగన్ సంస్థల్లోకి పెట్టుబడులుగా ప్రవేశించాయని, ఇది మనీలాండరింగ్ చట్ట నిబంధనలను ఉల్లంఘించడమేనని వాదించారు. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసినప్పటికీ ఇది ప్రత్యేక చట్టమని, మనీ లాండరింగ్ యాక్ట్లోని సెక్షన్ 44 ప్రకారం సీబీఐ, ఈడీ కేసులను విచారించే అధికారం ఈ కోర్టుకు ఉంటుందని వివరించారు. కాబట్టి, ఈడీ వాదనలను ప్రత్యేకంగా వినాల్సిందేనన్నారు. ప్రత్యేకంగా విచారణ జరపాలన్న అంశంపై సోమవారం వాదనలు కొనసాగిస్తామని ఈడీ తెలపడంతో సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను ఆ రోజుకు న్యాయమూర్తి వాయిదావేశారు.