శానిటైజర్లతో చర్మ సమస్యలు
ABN , First Publish Date - 2020-04-21T10:09:43+05:30 IST
హ్యాండ్ శానిటైజర్లను అత్యవసర పరిస్థితుల్లో పరిమితంగా వాడాలని, ఎక్కువగా వాడితే చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్

చేతులను సబ్బు, నీటితోనే శుభ్రపరచుకోండి
కరోనా, లాక్డౌన్తో పలువురిలో ఆందోళన
భయం వద్దు.. కరోనా మరణాలు 2-3 శాతమే
ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్ సూచనలు
హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): హ్యాండ్ శానిటైజర్లను అత్యవసర పరిస్థితుల్లో పరిమితంగా వాడాలని, ఎక్కువగా వాడితే చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) డైరెక్టర్ డాక్టర్ శంకర్ తెలిపారు. పరిశుభ్రమైన నీరు, సబ్బుతోనే చేతులు శుభ్రపరచుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. సోమవారం కింగ్ కోఠి ఆస్పత్రి సైకియాట్రిస్ట్ డాక్టర్ నివేదితతో కలిసి మాసబ్ట్యాంక్ సమాచార భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మరణాల శాతం 2 నుంచి 3 శాతం మాత్రమే ఉందని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని ధైర్యంగా ఉండాలని, కుటుంబంతో గడపాలని సూచించారు.
ఎక్కువ ఒత్తిడికి లోనుకాకుండా వినోద కార్యకలాపాల్లో పాల్గొనాలన్నారు. నిమ్మకాయ, నారింజ వంటి సి-విటమిన్ పండ్లను తీసుకోవాలని, శీతల పానీయాలకు దూరంగా ఉండాలని అన్నారు. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని 15 నుంచి 80 ఏళ్ల వయసు వారి నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయని కింగ్ కోఠి ఆస్పత్రి సైకియాట్రిస్ట్ డాక్టర్ నివేదిత తెలిపారు.