సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సత్యకుమార్

ABN , First Publish Date - 2020-11-21T16:16:50+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సత్యకుమార్

తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో ఏడు కొండలు కబ్జా అయ్యే అవకాశం ఉందని, ఏడుకొండలు కబ్జా కాకుండా ఉండాలంటే తిరుపతిలో జరిగే ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఒక మతవ్యాప్తి కోసం జగన్ పాకులాడుతున్నారని విమర్శించారు. ఎపీలో అభివృద్ధి శూన్యమని, అవినీతికి కొత్తమార్గాలను అన్వేషించడంలో ముఖ్యమంత్రి దిట్ట అని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని విమర్శించారు. ప్రతిపనిలో అలసత్వం, మౌలిక వసతులపై ఆలోచన లేదన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.


అనాలోచిత నిర్ణయాలు జగన్‌కే సాధ్యమని, టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి వైసీపీ నాయకులకు దోచిపెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని సత్యకుమార్ ఆరోపించారు. జగన్ అవినీతి మొత్తాన్ని త్వరలో బట్ట బయలు చేస్తామన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత బీజేపీకే ఉందన్నారు. ఆధ్యాత్మిక నగరంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి మొత్తం కేంద్రం నిధులదేనని, ప్రభుత్వ అవినీతి, అసమర్థతను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదాను చేర్చకుండా అడ్డుకుంది టీడీపీ, వైసీపీలేనని సత్యకుమార్ ఆరోపించారు.

ఇసుకను అధికార పార్టీ నేతలకు దోచి పెడుతున్నారని, తిరుపతి అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారని సత్యకుమార్ అన్నారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు బీజేపీ, జనసేనకు మాత్రమే ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, జనసేన అధినేత త్వరలో సమావేశమై అభ్యర్థిని ప్రకటిస్తారన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించి ప్రధాని మోదీకి కానుకగా ఇస్తామని సత్యకుమార్ అన్నారు.

Updated Date - 2020-11-21T16:16:50+05:30 IST