మావాళ్లకు ఇస్తావా..లేదా?

ABN , First Publish Date - 2020-11-25T09:51:35+05:30 IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన దివ్యాంగురాలైన ఓ మహిళా వలంటీరు ఆత్మహత్యాయత్నం చేశారు. అర్హత లేకున్నా తన మనుషులకు పింఛను ఇప్పించాలని స్థానిక వైసీపీ కార్యకర్త పెట్టే వేధింపులు తట్టుకోలేకపోతున్నానని ముఖ్యమంత్రికి లేఖ రాసి మంగళవారం ఎలుకల మందు తిన్నారు. తొలుత సత్తెనపల్లి ఏరియా

మావాళ్లకు ఇస్తావా..లేదా?

దివ్యాంగురాలైన మహిళా వలంటీరుపై

సత్తెనపల్లిలో వైసీపీ కార్యకర్త తీవ్ర ఒత్తిడి

పింఛను ఇప్పించాలంటూ బెదిరింపులు..ఆత్మహత్యాయత్నం


సత్తెనపల్లి, గుంటూరు(సంగడిగుంట), నవంబరు 24 : గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన దివ్యాంగురాలైన ఓ మహిళా వలంటీరు ఆత్మహత్యాయత్నం చేశారు. అర్హత లేకున్నా తన మనుషులకు పింఛను ఇప్పించాలని స్థానిక వైసీపీ కార్యకర్త పెట్టే వేధింపులు తట్టుకోలేకపోతున్నానని ముఖ్యమంత్రికి లేఖ రాసి మంగళవారం ఎలుకల మందు తిన్నారు. తొలుత సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు, మెరుగైన వైద్యం కోసం అనంతరం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు కుటుంబసభ్యులు ఆమెను తరలించారు. బాధితురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం, దివ్యాంగురాలైన మహంకాళి అంకేశ్వరి సత్తెనపల్లి ఆరో వార్డులో ఏడాదిగా వలంటీరుగా విధులు నిర్వహిస్తున్నారు. తన విధుల్లో భాగంగా అదే వార్డుకు చెందిన మాబులా అనే మహిళ పెట్టుకొన్న పింఛను దరఖాస్తును అంకేశ్వరి తిరస్కరించారు. ఆమె సాయానికి అనర్హురాలని పై అధికారులకు నివేదిక ఇచ్చారు. దీంతో ఆ మహిళ, ఆ వార్డుకు చెందిన నాగమల్లేశ్వరరావు(మల్లి) అనే రేషన్‌డీలర్‌.. అంకేశ్వరిపై పదేపదే తప్పుడు ఫిర్యాదులు చేశారు. మల్లి స్థానికంగా వైసీపీ కార్యకర్తగా చలామణి అవుతున్నాడు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో నెలరోజుల క్రితం అంకేశ్వరిని విధుల నుంచి తప్పించారు. 15 రోజుల క్రితం తిరిగి ఆమె డ్యూటీలో చేరారు. అప్పటినుంచి వారిద్దరూ మళ్లీ ఆమెపై వేధింపులు కొనసాగించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి సచివాలయం అడ్మిన్‌.. అంకేశ్వరికి ఫోన్‌ చేసి.. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్‌, వలంటీరుకు చెందిన ఇతర సామగ్రిని సచివాలయంలో మంగళవారం ఉదయం అప్పగించాలని ఆదేశించారు. దీంతో తన ఉద్యోగం పోయినట్లేనని అంకేశ్వరి భావించి, ఆత్మహత్యకు ప్రయత్నించారు. 

Updated Date - 2020-11-25T09:51:35+05:30 IST