ఉత్పత్తుల అమ్మకంపై అభ్యంతరం లేదు!
ABN , First Publish Date - 2020-06-11T09:20:27+05:30 IST
విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఉత్పత్తుల విక్రయాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని హైకోర్టుకు స్పష్టం చేసింది.

- కలెక్టర్ పర్యవేక్షణలో జరగాలని కోరుతున్నాం
- ఎల్జీ పాలిమర్స్ పిటిషన్లపై ప్రభుత్వం కౌంటర్
అమరావతి, జూన్ 10(ఆంధ్రజ్యోతి): విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఉత్పత్తుల విక్రయాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని హైకోర్టుకు స్పష్టం చేసింది. ఇందులోని ఉత్పత్తుల విక్రయాలకు కోర్టు అనుమతి ఇవ్వాలనుకుంటే అభ్యంతరం లేదని, అయితే, జిల్లా కలెక్టర్ సునిశిత పర్యవేక్షణలోనే అవి జరగాలని పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేసింది. ఆ విక్రయాలతో వచ్చిన నగదును కలెక్టర్ వద్దే భద్రపరిచేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ కోర్టుకు నివేదించారు.
ప్లాంట్లో ప్రమాదకర రసాయనాలు ఉన్నందున, వాటి నిర్వహణను నిపుణులు రేయింబవళ్లు పర్యవేక్షించాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది. అయితే లోనికి మరికొందరు అధికారులను అనుమతించాల్సిన అవసరంలేదని.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ ఇప్పటికే 30 మందిని అనుమతించారని తెలిపింది. దర్యాప్తు కోసం ఇప్పటికే ఏర్పాటైన కమిటీలు, చట్టబద్ధత ఉన్న సంస్థలు విధులు నిర్వర్తిస్తున్నాయని, దీనికి అవసరమైన డాక్యుమెంట్లు సంబంధిత వ్యవస్థల వద్ద ఉన్నాయని వివరించింది.