హోదా ఎందుకు అడగడం లేదు
ABN , First Publish Date - 2020-06-22T09:06:29+05:30 IST
‘బీజేపీ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి జగన్ ప్రతి విషయంలోనూ కలిసి పనిచేస్తున్నారు.
- జగన్కు శైలజానాథ్ ప్రశ్న
వేంపల్లె, జూన్ 21: ‘బీజేపీ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి జగన్ ప్రతి విషయంలోనూ కలిసి పనిచేస్తున్నారు. బేషరతుగా మద్దతు ఇస్తున్నారు. కానీ ప్రధాని మోదీని ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగడం లేదు’ అని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. కడప జిల్లా వేంపల్లెలో ఆదివారం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డితో కలిసి శైలజానాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎంపీలను ఇవ్వండి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన వైఎస్ జగన్... ఇప్పుడు 23 మంది ఎంపీలు ఉన్నా హోదా గురించి మాట్లాడకపోవడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు.
బీజేపీతో కలిసి పనిచేస్తున్నట్లు జనసేన చెప్పుకున్నట్లుగా వైసీపీ కూడా చెప్పుకోవాలన్నారు. పౌరసత్వ బిల్లుకు మద్దతుగా పార్లమెంటులో ఓట్లు వేసి బిల్లును పాస్ చేయించారని, అసెంబ్లీలో మాత్రం వ్యతిరేకమంటూ తీర్మానం చేయించి ద్వంద్వవైఖరి అవలంబించడం ప్రజలను మోసగించడం కాదా అన్నారు. వేల కోట్లు అప్పులు తీసుకొస్తున్నారు కానీ రాష్ట్రంలో అభివృద్ధి కనిపించలేదని అన్నారు.