భూసేకరణలో రూ.4 వేల కోట్లు స్వాహా
ABN , First Publish Date - 2020-09-14T08:25:55+05:30 IST
రాష్ట్రంలో ఇళ్ల స్థలాలకు భూసేకరణ పేరుతో వైసీపీ నాయకులు రూ.4 వేల కోట్లు స్వాహా చేశారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపణ
నర్సీపట్నం టౌన్(విశాఖపట్నం), సెప్టెంబరు 13: రాష్ట్రంలో ఇళ్ల స్థలాలకు భూసేకరణ పేరుతో వైసీపీ నాయకులు రూ.4 వేల కోట్లు స్వాహా చేశారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన స్థానిక విలేకరులకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఎకరా రూ.10 లక్షల విలువ చేసే భూమికి రూ.40 లక్షలు నుంచి రూ.50 లక్షలు చెల్లించారని.. ఒక్క విశాఖ జిల్లాలోనే రూ.150 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపించారు.
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి చంద్రబాబు అడ్డు తగులుతున్నారని ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు, చేతకానితనం వల్లే కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయని అయ్యన్న అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీకి 40 వేల ఎకరాలు సేకరించారని, అందులో నాలుగు వేల ఎకరాలు మాత్రమే కోర్టు వివాదాల్లో ఉన్నాయని.. పేదలపై ప్రేమ ఉంటే మిగిలిన 36 వేల ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.