దళితులపై దాడుల వెనుక అధికారపార్టీ నేతలు
ABN , First Publish Date - 2020-08-11T08:36:53+05:30 IST
రాష్ట్రంలో దళితులపై దాడులు పరాకాష్ఠకు చేరాయని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు

- ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్య మండిపాటు
- మహాజన సైన్యం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసన యాత్ర ప్రారంభం
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఆగస్టు 10: రాష్ట్రంలో దళితులపై దాడులు పరాకాష్ఠకు చేరాయని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు పి. అంజయ్య మండిపడ్డారు. దళితులపై దాడులను నిరసిస్తూ మహాజన సైన్యం చేపట్టిన రాష్ట్రవ్యాప్త నిరసన యాత్రను ఎస్వీయూలో సోమవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ...... రాష్ట్రంలో దళితులపై దాడుల వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. దాడులు చేసిన వారిపై కఠిన శిక్షలు అమలు కాకపోవడంతోనే ఈ అనుమానం కలుగుతోందని తెలిపారు. దళితులపై దాడుల పట్ల విద్యార్థులు, యువత స్పందించాలని కోరారు. మహాజన సైన్యం అధ్యక్షుడు చేపూరి సురేంద్ర మాట్లాడుతూ.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన దళితులపై దాడులకు నిరసనగా 13 జిల్లాల్లో నిరసన యాత్రలు చేపడుతున్నామని తెలిపారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్లకు దళితులపై జరుగుతున్న దాడుల గురించి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు వినతిపత్రం అందజేశారు.