విశాఖలో భవిష్యత్తులోనూ ప్రమాదాలు
ABN , First Publish Date - 2020-05-08T18:06:34+05:30 IST
నగరంలోని ఎల్జీ పాలిమర్స్ ఘటనతో విశాఖ పరిస్థితిపై చర్చ మొదలైంది.
![విశాఖలో భవిష్యత్తులోనూ ప్రమాదాలు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020050810543638/05082020123505n51.jpg)
విశాఖ: నగరంలోని ఎల్జీ పాలిమర్స్ ఘటనతో విశాఖ పరిస్థితిపై చర్చ మొదలైంది. నగరం చుట్టూ ఉన్న పరిశ్రమలతో మున్ముందు కూడా ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. విశాఖ భౌగోళిక పరిస్థితి భిన్నమని, మేలుకోకపోతే పెను ప్రమాదం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
విశాఖపట్టణం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక రాజధాని. ఇక్కడ ఎన్ని భారీ పరిశ్రమలు ఉన్నాయో అంతే సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. 1997లో హెచ్పీసీఎల్ గ్యాస్ ట్యాంకులు పేలినప్పుడు 60 మంది మరణించారు. ప్రజలు కొండలు, గుట్టలెక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. నాలుగేళ్ల కిందట అదే కంపెనీలో కూలింగ్ టవర్ కూలిపోయి 38 మంది చనిపోయారు. స్టీల్ ఫ్లాంట్లో 2012లో గ్యాస్ లీకై, ట్యాంకర్ పేలిపోయి 19 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఘటనతో విశాఖ మరోసారి జాతీయ స్థాయిలో వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ పారిశ్రామిక కాలుష్యంపై చర్చ మొదలైంది. ఏ కాలుష్యమైనా నగరంలోనే తచ్చాడుతూ కిందికి దిగుతుంది. దీనివల్ల ఇక్కడి ప్రజలు దీర్ఘకాలిక అనారోగ్యంబారినపడి బాధపడుతున్నారు.