ఈ నెల 29 నుంచే రేషన్‌

ABN , First Publish Date - 2020-03-24T12:26:39+05:30 IST

ఈ నెల 29 నుంచే రేషన్‌

ఈ నెల 29 నుంచే రేషన్‌

 సివిల్‌ సప్లయిస్‌ అధికారుల నిర్ణయం   

డిపోల దగ్గర రద్దీని నివారించటానికి ముందస్తు పంపిణీ     

రెండు రోజుల్లో స్టాక్‌ పాయింట్లకు బియ్యం, కందిపప్పు     

విజయవాడ : వచ్చే నెలలో ఇవ్వాల్సిన నిత్యావసరాలను ఈనెల 29 నుంచే కార్డుదారులకు పంపిణీ చేసేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ (సివిల్‌ సప్లయిస్‌) కసరత్తు చేస్తోంది. బియ్యం, కందిపప్పు ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రెండు రోజుల్లో బియ్యం, కందిపప్పు జిల్లా స్టాక్‌ పాయింట్లకు చేరనున్నట్టు సమాచారం.    కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిత్యావసరాల దుకాణాల వద్ద రద్దీ లేకుండా చేయాలన్న ఆదేశాలు ప్రభుత్వం నుంచి వచ్చాయి. దీంతో ఉచిత బియ్యం, కందిపప్పును సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని, ఈ నెల 29 నుంచి సరఫరా చేయాలని జిల్లా అధికారులు భావించారు. డిపోల వద్ద రద్దీని నివారించటానికి ఈ ముందస్తు పంపిణీ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. నిత్యావసరాలను యుద్ధప్రాతిపదికన స్టేజ్‌-1 రవాణా ద్వారా శాటిలైట్‌ స్టాక్‌ పాయింట్లకు చేరవేయాలని నిర్ణయించారు. శాటిలైట్‌ స్టాక్‌ పాయింట్లకు వచ్చిన తర్వాత డీలర్లకు సమాచారం అందించి స్టేజ్‌-2 రవాణా ద్వారా ప్రతి డిపోకు నిత్యావసరాలను చేరవేయనున్నారు.

Updated Date - 2020-03-24T12:26:39+05:30 IST