టీటీడీ ఆస్తుల వేలంపై స్వరూపానందేంద్ర నోరు విప్పాలి: రమేష్
ABN , First Publish Date - 2020-05-24T19:31:18+05:30 IST
టీటీడీ ఆస్తుల వేలంపై స్వరూపానందేంద్ర నోరు విప్పాలి: రమేష్

తిరుపతి: టీటీడీ పాలకమండలి తీసుకునే నిర్ణయాలన్నీ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు వ్యాఖ్యానించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హిందూ ఆలయాల వసతి సముదాయాలను క్వారంటైన్లలకు ఉపయోగించినా తాము అభ్యంతరం చెప్పలేదన్నారు. ఏపీలో నిరుపయోగంగా ఉన్న చర్చ్ భూములు ఎన్నో ఉన్నాయని... వాటిని ఎందుకు సీఎం విక్రయించరని ప్రశ్నించారు. వక్ఫ్బోర్డు భూములను ఎందుకు అమ్మరని ఆయన నిలదీశారు.
టీటీడీ ప్రతిష్ట దిగజారేలా సీఎం వ్యవహరిస్తుంటే విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఎందుకు ప్రశ్నించరన్నారు. టీటీడీ ఆస్తుల వేలంపై స్వరూపానందేంద్ర స్వామి నోరు విప్పాలని డిమాండ్ చేశారు. అన్యమతస్తులకు ఒక న్యాయం.. హిందువులకు మరో న్యాయమా..? అని ప్రశ్నించారు. శ్రీవారి లడ్డూలను బహిరంగవేలం వేసేలా అమ్ముతారా..? అని మండిపడ్డారు. టీటీడీ పాలకమండలి నిర్ణయాలకు వ్యతిరేకంగా 26న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయనున్నట్లు రమేష్ తెలిపారు.