ఏపీలో ప్రతిపక్ష స్థానం ఖాళీ : రామ్ మాధవ్
ABN , First Publish Date - 2020-08-11T21:36:36+05:30 IST
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన

అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష స్థానం ఖాళీ అయ్యిందని జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీతో ఎలా ఉండాలో.. రాష్ట్ర ప్రజల కోసం ఎలా పోరాటం చేయాలో కార్యకర్తలకు పలు సూచనలు చేస్తూ.. రాజధానులపై పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయశక్తిగా ఎదగాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రతిపక్ష స్థానాన్ని బీజేపీ భర్తీ చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర కమలనాథులకు రాంమాధవ్ సూచించారు.
రాబోయే నాలుగేళ్లలో..
ఎవరు అధ్యక్షులు అవుతారో కూడా నిర్ధేశించుకోలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని విమర్శలు గుప్పించారు. భవిష్యత్లో రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ మరో బాధ్యత తీసుకుంటారని రాంమాధవ్ చెప్పుకొచ్చారు. రాబోయే నాలుగేళ్లలో బలమైన శక్తిగా ఎదగాలని దిశానిర్దేశం చేశారు. మోదీ మరో పది, పదిహేనేళ్ల ఉండొచ్చు కానీ అది ఏపీ బీజేపీకి సరిపోదన్నారు. మంచి అవకాశాన్ని బీజేపీ కార్యకర్తలు ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు. ప్రజల కోసం నిలబడే పార్టీగా బీజేపీ ఎదగాలని రామ్ మాధవ్ అభిప్రాయపడ్డారు.
