సీఎం జగన్..సిగ్గునిపించడం లేదా?: రఘురామకృష్ణమరాజు
ABN , First Publish Date - 2020-12-30T16:36:14+05:30 IST
రామతీర్థం ఘటనపై ఎంపీ రఘురామ కృష్ణమరాజు తీవ్రంగా స్పందించారు.
రామతీర్థం ఘటనపై ఎంపీ రఘురామ కృష్ణమరాజు తీవ్రంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఘటన జరిగితే సిగ్గనిపించడంలేదా? అంటూ సీఎం జగన్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్కు హిందువులంటే అంత చులకనా? అని ప్రశ్నించారు. కొంతమంది చేస్తున్న వికృతిక్రీడ ఇలాగే కొనసాగుతుందంటే.. దీని వెనుక ఎవరైన పెద్దల హస్తముందా? అనే అనుమానం కలుగుతుందని, ఆ పెద్దలు ఎవరని ప్రశ్నించారు.
ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరొందిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి తల భాగాన్ని వేరుచేసి ఎత్తుకెళ్లారంటే ముఖ్యమంత్రికి సిగ్గు అనిపించడంలేదా? అని రఘురామకృష్ణమరాజు అన్నారు. శ్రీరాముడంటే ఎందుకంత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. ఇన్నాళ్లు ఎన్నో విగ్రహాలకు కాళ్లు, చేతులు నరికారని, ఇప్పుడు ఏకంగా శ్రీరాముడి తల నరికి ఎత్తుకెళ్లడమంటే ఇది హిందూ సమాజం మీద చేస్తున్న దాడిగానే భావిస్తున్నామని రఘురామ కృష్ణమరాజు అన్నారు.