-
-
Home » Andhra Pradesh » President Ramnath Kovind
-
గోవిందుడి సన్నిధిలో కోవిందుడు
ABN , First Publish Date - 2020-11-25T09:17:11+05:30 IST
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా మంగళవారం తిరుమలేశుడిని దర్శించుకున్నారు. భార్య, కుమార్తెతో చెన్నై నుంచి వైమానికదళ ప్రత్యేక విమానంలో ఉదయం 10.45 గంటలకు తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయం చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి

తిరుమలేశుడిని దర్శించుకున్న రాష్ట్రపతి
తిరుపతి/తిరుమల, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా మంగళవారం తిరుమలేశుడిని దర్శించుకున్నారు. భార్య, కుమార్తెతో చెన్నై నుంచి వైమానికదళ ప్రత్యేక విమానంలో ఉదయం 10.45 గంటలకు తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయం చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, రాజంపేట, చిత్తూరు ఎంపీలు మిఽథున్రెడ్డి, రెడ్డెప్ప, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, అదనపు డీజీపీలు చంద్రశేఖర్ ఆజాద్, హరీశ్కుమార్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి తొలుత తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం చేరుకున్నారు. అరగంట ఆలయంలో గడిపిన కోవింద్, మధ్యాహ్నం 12గంటలకు తిరుమల బయల్దేరి.. 12.54 గంటలకు పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్రెడ్డి స్వాగతం పలికారు. రాష్ట్రపతి కుటుంబ సభ్యులు మధ్యాహ్నం 2.20 గంటలకు అతిథి గృహం నుంచి బయల్దేరి తొలుత వరాహస్వామిని దర్శించుకున్నారు. 2.45గంటలకు తిరునామంతో శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికి లోపలకు తీసుకెళ్లారు.
స్వామి వారిని దర్శించుకున్న అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలికి.. శ్రీవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలు బహూకరించారు. ఆలయంలో 45 నిమిషాలు గడిపిన కోవింద్ 3.30కు బయటకు వచ్చి.. అతిథిగృహం చేరుకున్నారు. కొంతసమయం విశ్రాంతి తీసుకుని టీటీడీ ఏర్పాటు చేసిన ఊతప్పం, దోసె, పెరుగు వడ స్వీకరించారు. 5 గంటలకు తిరుమల నుంచి బయల్దేరి విమానాశ్రయం చేరుకుని వైమానికదళ ప్రత్యేక విమానంలో తిరిగి చెన్నై వెళ్లారు. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు గవర్నర్, సీఎం జగన్ వేర్వేరు విమానాల్లో రేణిగుంట చేరుకున్నారు. అనంతరం రాష్ట్రపతి వెంట విశ్వభూషణ్.. తిరుచానూరు, తిరుమల వెళ్లగా.. సీఎం మాత్రం ప్రధాని మోదీ కొవిడ్-19కు సంబంధించి సీఎంలతో నిర్వహించనున్న వీసీలో పాల్గొనేందుకు విజయవాడ వెళ్లిపోయారు.