టీడీపీ అభ్యర్థి కోసం పోలీసుల వేట
ABN , First Publish Date - 2020-03-13T10:27:57+05:30 IST
గుంటూరు జిల్లా మాచర్ల జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకోవాలని వైసీపీ శ్రేణులు ఒత్తిడి చేస్తున్నాయి. అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడి ఈ స్థానానికి టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు...
గుంటూరు, మార్చి 12(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా మాచర్ల జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకోవాలని వైసీపీ శ్రేణులు ఒత్తిడి చేస్తున్నాయి. అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడి ఈ స్థానానికి టీడీపీ తరఫున నామినేషన్ వేసేందుకు స్థానికులు ఎవరూ ముందుకురాలేదు. నాగార్జున సాగర్ వాసి, హైదరాబాద్లో ఉండే న్యాయవాది చందులాల్ నాయక్ టీడీపీ తరఫున బరిలోకి దిగేందుకు ముందుకొచ్చారు. ఆయనకు ఇక్కడ ఓటు ఉండడంతో నామినేషన్ ఆమోదం పొందింది. ఏకగ్రీవంగా గెలుపొందాలని భావించిన వైసీపీ శ్రేణులు నామినేషన్ను ఉపసంహరిచుకోవాలని బెదిరించారు. బరిలో నిలవాలనే ఉద్దేశంతో చందులాల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన కోసం వైసీపీ నాయకులతో పాటు సుమారు 25మంది పోలీసులు అన్వేషిస్తున్నట్లు తెలిసింది. చందులాల్ కుటుంబీకులను అదుపులోకి తీసుకుని అతని ఆచూకీ చెబుతారా, చంపేయమంటారా అని బెదిరిస్తున్నట్లు సమాచారం.