సరే.. ఈసారికి ఇస్తున్నాం!
ABN , First Publish Date - 2020-11-03T08:50:37+05:30 IST
పోలవరం ప్రాజెక్టు తుది అంచనా వ్యయంలో భారీగా కోతపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్ను కాస్త కరుణించింది. ప్రాజెక్టుకు రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన రూ.2,234.28 కోట్లను
రాష్ట్రానికి 2,234 కోట్లు రీయింబర్స్
నాబార్డు ద్వారా పీపీఏకి విడుదల
జలశక్తి శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ లేఖ
20,398 కోట్ల అంచనాకు అంగీకరిస్తేనే
భవిష్యత్లో పోలవరానికి నిధులు
తేల్చిచెప్పిన ఆర్థిక శాఖ
అమరావతి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు తుది అంచనా వ్యయంలో భారీగా కోతపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ ఆంధ్రప్రదేశ్ను కాస్త కరుణించింది. ప్రాజెక్టుకు రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన రూ.2,234.28 కోట్లను రీయింబర్స్ చేసేందుకు సమ్మతించింది. ఇదే సమయంలో తుది అంచనాలపై తన వైఖరిని పునరుద్ఘాటించింది. 2013-14నాటి అంచనా వ్యయం రూ.20,398 కోట్లకు అంగీకరించాల్సిందేనన్న షరతు విధించింది. అప్పుడే భవిష్యత్లో రాష్ట్రానికి నిధులు మంజూరుచేస్తామని తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టు కోసం వ్యయం చేసిన రూ.2,234 కోట్లను విడుదల చేయాలన్న రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తిని మన్నించి.. నాబార్డు ద్వారా ఆ మొత్తాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి విడుదల చేస్తున్నట్లు కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసింది. ఈ నిధులకు సంబంధించిన సమాచారాన్ని త్వరితగతిన తన పరిధిలోని వ్యయ విభాగానికి పీపీఏ పంపాలని సూచించింది.
తుది అంచనాలకు సంబంధించి గత నెల 12వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ.. జలశక్తి శాఖకు ఇచ్చిన సమాచారంతో ప్రాజెక్టుకు నిధుల విడుదలలో జాప్యం జరుగుతుందని.. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు నష్టమని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతానికి రూ.2,234 కోట్ల విడుదలకు వ్యయ విభాగానికి సమాచారం ఇస్తున్నామని.. మున్ముందు మాత్రం తప్పనిసరిగా గత నెల 12వ తేదీన పేర్కొన్న షరతుల మేరకే నిర్ణయాలు ఉంటాయని జలశక్తి శాఖకు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.