ముక్క కోసం రోడ్డెక్కారు!

ABN , First Publish Date - 2020-03-30T08:00:58+05:30 IST

కరోనా నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఆదివారం ముక్క కోసం బయటకొచ్చారు. సామాజిక దూరం, మాస్కులు ధరించాలనే నిబంధన మరచి మాంసం, చేపలు, చికెన్‌ దుకాణాలకు ఎగబడటంతో...

ముక్క కోసం రోడ్డెక్కారు!

  • సామాజిక దూరాన్ని గాలికొదిలారు
  • రాష్ట్రంలో చికెన్‌, మటన్‌కు పెరిగిన గిరాకీ
  • దుకాణాల వద్ద బారులుతీరిన కొనుగోలుదారులు
  • ఉత్తరాంధ్రలో ఆరు లక్షల కిలోల చికెన్‌ అమ్మకాలు

విశాఖపట్నం/కాకినాడ/ఏలూరు/అనంతపురం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఆదివారం ముక్క కోసం బయటకొచ్చారు. సామాజిక దూరం, మాస్కులు ధరించాలనే నిబంధన మరచి మాంసం, చేపలు, చికెన్‌ దుకాణాలకు ఎగబడటంతో.. విశాఖపట్నం, ఉభయ గోదావరి, అనంతపురం జిల్లాల్లో నాన్‌వెజ్‌ మార్కెట్లు కిటకిటలాడాయి. ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా పోలీసులు అడ్డుకుంటున్నా స్వీయ నిర్బంధం నుంచి ప్రజలు బయటకు రావడంతో రోడ్లు వాహనాలతో నిండిపోయాయి. చికెన్‌ తింటే కరోనా వైరస్‌ సోకుతుందనే వదంతులతో ఫిబ్రవరి మొదటి వారం నుంచి అమ్మకాలు లేక వెలవెలబోయిన చికెన్‌, మటన్‌ దుకాణాల వద్ద ఈ ఆదివారం జనం బారులు తీరి కనిపించారు.


ముఖ్యంగా విశాఖ నగరంలోని దాదాపు అన్ని మాంసం దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా కనిపించాయి. ఆదివారం ఉత్తరాంధ్రలో ఆరు లక్షల కేజీల చికెన్‌ అమ్మకం జరిగిందని కోళ్ల పరిశ్రమవర్గాలు వెల్లడించాయి. దీనిలో మూడున్నర లక్షల కిలోల చికెన్‌ ఒక్క విశాఖ నగరంలోనే విక్రయించినట్టు చెప్పారు. కాగా గత ఆదివారం కిలో రూ.100 ఉన్న చికెన్‌... ఈ ఆదివారం రూ.180 నుంచి రూ.200లకు విక్రయించారు. విశాఖ నగరంలో మటన్‌కు కూడా గిరాకీ పెరగడంతో కొన్నిచోట్ల కిలో రూ.800 నుంచి రూ.900కు విక్రయాలు చేపట్టారు. చేపల విక్రయాలు భారీగా సాగాయి. ఫిషింగ్‌ హార్బర్‌కు కొనుగోలుదారులు పోటెత్తారు. ఉభయ గోదావరి, అనంతపురం జిల్లాల్లోనూ మార్కెట్లకు పోటెత్తారు. మీటరు దూరం పాటించాలన్న ఆదేశాలను ఎవరూ పాటించలేదు. 


Updated Date - 2020-03-30T08:00:58+05:30 IST