లాక్డౌన్ను లెక్కచేయలేదు!
ABN , First Publish Date - 2020-03-29T09:16:10+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ను శనివారం చాలా జిల్లాల్లో ప్రజలు లెక్కచేయలేదు. ఒకటి రెండు జిల్లాల్లో స్వీయ నియంత్రణ పాటించినా...
- చాలా జిల్లాల్లో పెరిగిన ఉల్లంఘనలు
- పోలీసుల లాఠీ చార్జ్, జరిమానాలు
- రైతు బజార్లు కిటకిట
- ధరలు పెంచేసిన వ్యాపారులు
(ఆంధ్రజ్యోతి-న్యూ్సనెట్వర్క్) : రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ను శనివారం చాలా జిల్లాల్లో ప్రజలు లెక్కచేయలేదు. ఒకటి రెండు జిల్లాల్లో స్వీయ నియంత్రణ పాటించినా మెజారిటీ జిల్లాల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కూడా రోడ్లమీదే కనిపించారు. రైతు బజార్లు, నిత్యావసర దుకాణాల్లో సామాజిక దూరం పాటించలేదు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెలో రోడ్లపై సరదాగా తిరుగుతున్న యువకులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. బి.కొత్తకోట వద్ద కర్ణాటక సరిహద్దుల్లోని చెక్పోస్టు వద్దకు శనివారం కర్ణాటక రాష్ట్రం చింతామణి నుంచి గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన వలస కూలీలు రాగా జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు శాంతిపురం మండలం బీఎం గొల్లపల్లెకు 18మంది ఒడిసా కూలీలు రావడంతో కుప్పం క్వారంటైన్కు తరలించారు.
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 179(1) సెక్షన్ కింద 685 కేసులు నమోదుచేసి, రూ.3.42లక్షల జరిమానా విధించారు. లాక్డౌన్ను కొందరు వ్యాపారులు అనుకూలంగా మార్చుకుని కూరగాయలు, నిత్యవసరాల ధరలు పెంచేశారు. అనంతపురంలో ప్రజలు సామాజిక దూరాన్ని పాటించకుండా సాయంత్రం వరకు రోడ్లపై తిరిగారు. శ్రీకాకుళం నగరం నడిబొడ్డున ఓ వైసీపీ నేత ఇంటివద్ద స్థానికుల రాకపోకలతో సందడి నెలకొంది. దీనిపై కొందరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇంటి ముందు ‘ఇంటికి ఎవరూ రావద్దు’ అంటూ కరపత్రాన్ని అంటించారు.