బ్రేకింగ్ : జగన్ కీలక నిర్ణయం.. పెన్మత్స కుమారుడికి ఎమ్మెల్సీ టికెట్?
ABN , First Publish Date - 2020-08-12T01:00:25+05:30 IST
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

అమరావతి : సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లాకు చెందిన పెన్మత్స సాంబశివరాజు ఇటీవల అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. అయితే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని భావించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పెన్మత్స తనయుడు డాక్టర్ పెన్మత్స సూర్య నారాయణరాజు (సురేష్బాబు)ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దింపాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 13న సురేష్ నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి సురేష్ బాబు పేరును జగన్ ఖరారు చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
షాకైన ఆశావహులు!?
కాగా.. ఈ టికెట్ను మొదట సీనియర్ నేత మర్రి రాజశేఖర్కు ఇవ్వాలని జగన్ భావించారు. అయితే సాంబశివరాజు మరణంతో చివరి నిమిషంలో సురేష్కు అవకాశం దక్కినట్లు తెలియవచ్చింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా సురేష్కు ఈ అవకాశం దక్కిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇవాళ రాత్రి లోపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. జగన్ తీసుకున్న ఈ కీలక తాజా నిర్ణయంతో ఆశావహులు ఒకింత షాకైనట్లు తెలుస్తోంది. మర్రి రాజశేఖర్తో పాటు కడప జిల్లాకు చెందిన ఆకేపాటి అమరనాథ్రెడ్డి, తోట త్రిమూర్తులు కూడా ఎమ్మెల్సీ టికెట్ దక్కుతుందని ఆశించినట్లుగా సమాచారం.